‘‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’’ – ఈ ఒక్క ప్రశ్నే దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రేక్షకుల్ని ఉత్కంఠలో ముంచేసింది. అప్పటి వరకూ తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన మహాసాగరంలా నిలిచింది బాహుబలి సిరీస్. ఈ సిరీస్‌కు దేశమంతా ఫిదా అయిపోయింది. ఇప్పుడు అదే బాహుబలి మళ్లీ తెరపైకి రాబోతున్నాడు – కానీ కొత్త టైటిల్‌తో, కొత్త ఫార్మాట్‌తో, కొత్త అనుభూతితో. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ అనే రెండు భాగాల్ని కలిపి ఇప్పుడు ‘బాహుబలి: ది ఎపిక్’ అనే టైటిల్‌తో రీ-రిలిజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
 

ఈ ప్రాజెక్ట్ వెనుక visionary డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి ఉండడమే కాదు, ఆయనే స్వయంగా ఈ ఎడిటింగ్ పనుల్ని పర్యవేక్షిస్తున్నారని సమాచారం. మొత్తం ఐదున్నర గంటల నిడివి ఉన్న రెండు సినిమాల్ని కుదించి, మూడున్నర నుంచి నాలుగు గంటల మధ్య ఒకే సినిమాలోకి మలచాలన్నది రాజమౌళి టార్గెట్. ఈసారి బాహుబలి విజువల్ ఎక్స్‌పీరియన్స్ మరింత విస్తృతంగా ఉండబోతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో రెండో పార్ట్‌లో కట్ చేసిన కొన్ని కీలక సన్నివేశాలూ, కొన్ని సాంగ్స్ మళ్లీ ఈ ఎడిషన్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయని వినికిడి. అలానే ఈ రీ-రిలీజ్‌కోసం కొత్త ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. అక్టోబర్ నెలలో థియేటర్లలో ఈ గ్రాండ్ రీ ఎంట్రీ ఉండబోతోంది.



ఇదిలా ఉంటే, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ‘బాహుబలి’ అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుంచి ‘‘బాహుబలిని కట్టప్ప చంపకపోతే?’’ అన్న పోస్టు వైరల్ అవుతోంది. దీనికి రానా దగ్గుబాటి స్పందిస్తూ – “నేను అతన్ని చంపేసేవాడిని” అని షాకింగ్ కామెంట్ చేశాడు. వెంటనే ప్రభాస్ కూడా స్పందిస్తూ – “దీని కోసమే అలా జరగనిచ్చాను భల్లాలదేవా” అంటూ తన స్టైల్‌లో రిప్లై ఇచ్చాడు. ఈ సంభాషణ సోషల్ మీడియాలో వేడెక్కించేస్తోంది. ఇంత ప్రమోషన్, ఇంత అంచనాలు చూస్తుంటే… ‘బాహుబలి: ది ఎపిక్’ మళ్లీ కొన్ని రికార్డులను బద్దలు కొడతాడనే నమ్మకం బలంగా ఉంది. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ఈ రీ రిలీజ్ కానున్నట్టు సమాచారం. అలాగే ఈ సినిమా ఓటీటీలో కాకుండా థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌కి అనుగుణంగా రూపుదిద్దుకుంటోంది. బాహుబలి మళ్లీ వస్తున్నాడు ..ఈసారి కొత్తగా, మెరుగ్గా, మరింత గర్వంగా!

మరింత సమాచారం తెలుసుకోండి: