
విచిత్రం ఏంటంటే ఆయన కెరీర్ శాసన మండలి సభ్యుడి గా ప్రారంభ మైంది. అలాగే మండలి సభ్యుడి గానే ఆయన రిటైర్ అయ్యారు. రోశయ్య తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ పదవికి ఆయన వన్నె తేవడంతో పాటు చెన్నారెడ్డి నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత రోశయ్యకు తిరుగు లేకుండా పోయింది. పలువురు ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు.
2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నారు. రోశయ్య ఆర్థిక మంత్రి గా పని చేశారు. 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికైనారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య ఏ పదవి చేపట్టినా కూడా దానికి వన్నె తెచ్చారు.
అలాగే 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి అప్పుడు కాంగ్రెస్ పార్టీని సంక్షోభం నుంచి గట్టెక్కించారు. ఆ తర్వాత ఆయన మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు.