మానవ సంబంధాలను మంటగలుపుతున్న మరో సంఘటన ఇది. ఆడపిల్లలను తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా పెంచుకోవాలో చెప్పే దారుణ సంఘటన. బాబాయ్ బాబాయ్ అంటూ ప్రేమగా పిలిచే పిల్లలనే చెరబట్టిన ఓ కామాంధుడి అరాచకం ఇది. విశాఖ జిల్లా పెందుర్తిలో ఈ ఘటన జరిగింది.


బాబాయిగా పరిచయమై.. ముగ్గురు అక్కచెల్లెళ్లతో పరిచయమై.. వారిని లొంగతీసుకున్నట్టు తెలిసింది. అంతే కాదు.. వారిని ఒంగోలు తీసుకెళ్లి వారిలో పెద్దమ్మాయికి మాయమాటలు చెప్పి పెళ్లి కూడా చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విశాఖ జిల్లా పెందుర్తిలోని చినముషిడివాడ వుడాకాలనీ వాసి అరవింద్‌ స్థానికంగా లారీ ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు నుంచి వలస వచ్చిన ఇతడు భార్యతో కలిసి ఉంటున్నాడు.


అరవింద్ దంపతులకు పిల్లలు లేరు. వీరు గతంలో ఓ గ్రామంలో నివాసంలో ఉన్న సమయంలో నిందితుడి భార్య బ్యూటీపార్లర్‌ కోర్సు నేర్చుకునేది. అక్కడ మరో మహిళతో ఆమెకు పరిచయమైంది. ఇద్దరూ సొంత అక్కాచెల్లెళ్లలా మెలిగేవారు. భర్తతో విడిగా ఉంటున్న ఆ మహిళకు ముగ్గురు కుమార్తెలున్నారు. బాలికలు అరవింద్‌ను బాబాయ్‌ అంటూ పిలిచేవారు. ఈ నెల 3న అరవింద్‌ తన భార్యతో గొడవపడి బయటకు వెళ్లిపోయాడు.


అరవింద్ ను ఇంటికి తీసుకొస్తామంటూ బాలికలూ వెళ్లారు. ముగ్గురూ ఎంతకూ తిరిగి రాకపోవడంతో బాలికల తల్లి పెందుర్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలికలతో కలిసి అరవింద్‌ ఒంగోలులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాలికలపై నిందితుడు మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పెద్దమ్మాయిని వివాహం చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకునే ఇలాంటి మోసగాళ్లను కఠినంగా శిక్షించాలని ఆ తల్లి కోరుకుంటోంది. తల్లిదండ్రులు కూడా ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: