ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నా.. ఆ పార్టీకి చెందిన నేతలు అన్నా తోక తొక్కిన విరుచుకుపడుతూ ఉంటుంది ఆంధ్రజ్యోతి మీడియా. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్లపాటు బాబుకు అనుకూలంగా పెద్ద ఎత్తున కథనాలను ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలు విపరీతంగా ప్రచారం చేశాయి. చంద్రబాబు అధికారంలోకి రావాలని... జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలు అవుతుందని ఇష్టం వచ్చినట్టు కథనాలను ప్రచురించాయి. అయితే ఆంధ్రజ్యోతి అంచనాలకు భిన్నంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చే సీఎం అయ్యారు.
జగన్ సీఎం అయినప్పటి నుంచి కూడా ఆంధ్రజ్యోతి... జగన్, వైసీపీ ప్రభుత్వం ఎక్కడ దొరుకుతుందా అని కాచుకుని కూర్చుంది. ఏ చిన్న లైన్ దొరికినా తీవ్రంగా విమర్శలు చేస్తోంది. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్ల పరిశ్రమ విషయంలో చేసిన రెండు ట్వీట్లను ఆధారంగా చేసుకుని మళ్ళీ జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ రెండు ట్వీట్లు వేర్వేరుగా ఉండడంతో ఆ లాజిక్ ను లాగేసిన ఆంధ్రజ్యోతి వైసీపీ ప్రభుత్వంను ఏకి పడేసింది.
ఈ యేడాది మే 12న అప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కియా కార్ల పరిశ్రమను టార్గెట్గా చేసుకుని కార్లు అమ్ముడు పోని కారణంగా కియా మోటర్స్ చైనాలో తన ప్లాంట్ను మూసివేసిందని... మరి ఇప్పుడు అనంతపురంలో ఏర్పాటు అవుతోన్న కియా కార్ల ప్లాంట్ పరిస్థితి ఏంటని ప్రశ్నించడంతో పాటు నాటి బాబు ప్రభుత్వాన్ని విమర్శించారు. బాబు వేల కోట్ల రాయితీలు ఇస్తున్నా స్థానికంగా వంద మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించారు.
అయితే గురువారం అదే కియా ప్లాంట్పై వైఎస్సార్ పార్టీ ట్వీట్టర్ అక్కౌంట్ నుంచి మరో విధమైన కామెంట్ వచ్చింది. మహానేత వైఎస్సార్ కృషితోనే కియాను దక్షిణ కొరియా సంస్థ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. వైఎస్ కృషితోనే రు.13, 500 కోట్లతో కియా పరిశ్రమను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అంటే నాడు విజయసాయి ఇదే పరిశ్రమపై టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని దీని వల్ల ఉపయోగం లేదని చెప్పారు.. కానీ నేడు ఆ కియా ప్లాంట్ తెచ్చింది వైఎస్సే నని చెప్పుకుంటున్నారు. ఈ రెండు విరుద్ధమైన ట్వీట్లను బేస్ చేసుకుని జ్యోతి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తోంది.