చిలకలూరిపేట శాసనసభ్యురాలు విడదల
రజినీ నిజ జీవితంలో మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా చురుకుగా ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఆమె
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సోషల్
మీడియా వేదికగా వివరిస్తుంటారు. అలాగే వైయస్సార్సీపి పాలనలో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధిస్తున్న విజయాలను సైతం అందరికీ అర్థమయ్యేలా చెబుతుంటారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆమె చేతల కూడా అతని పనితనాన్ని చూపిస్తుంటారు. అంతే కాదు ఆమె తన నియోజకవర్గానికి సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తారు. తమ నియోజక వర్గంలోని ప్రతి ఒక్క లబ్ధిదారునికి ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందేలా ఆమె కృషి చేస్తున్నారు.
గత కొద్ది రోజులుగా ఆమె జగనన్న తోడు పథకం కింద నియోజకవర్గ ప్రజల్లోని లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తున్నారు. కోట్ల రూపాయల వ్యయంతో
చిలకలూరిపేట పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె శ్రీకారం చుడుతున్నారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి ఆమె హాజరవుతూ సాటి ఎమ్మెల్యేలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. పర్యావరణ దినోత్సవం రోజు ఆమె మొక్కలు నాటి.. పర్యావరణాన్ని సంరక్షించడం ఎంత ముఖ్యమో తమ నియోజకవర్గ ప్రజలకు వివరించారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్
జగన్ మోహన్
రెడ్డి రెండేళ్ల కాలంలో అందించిన పాలన గురించి కూడా ఆమె వీడియో రూపంలో చాలా చక్కగా తెలియజేశారు. ఐతే తాజాగా ఆమె ప్రపంచ రక్త దాన దినోత్సవం సందర్భంగా ఒక పోస్ట్ షేర్ చేశారు.
"ఈ ప్రపంచ రక్త దాన దినోత్సవం రోజున.. కరోనా మహమ్మారి సమయంలో రక్షించటానికి వచ్చిన ఎందరో రక్తదాతలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సమాజం పట్ల వారు చేసిన నిస్వార్థ సేవకు నా ధన్యవాదాలు," అని
చిలకలూరిపేట శాసన సభ్యురాలు విడదల
రజినీ పేర్కొన్నారు. వాస్తవానికి
ఎమ్మెల్యే విడదల
రజినీ గతంలో రక్తదానం చేశారు. వాటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.