ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటుతుంది. 2019 లో జరిగిన ఎన్నికల్లో జగన్ 151 సీట్లు అధికారంలోకి వచ్చారు. ఆయన తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన వెంటనే రెండు న్న‌ర సంవత్సరాల తర్వాత 90 % మంది మంత్రులను మార్చేసి.. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తానని చెప్పారు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వారిలో చాలా మంది సీనియ‌ర్ నేతలు ఉన్నారు. వీరందరూ మంత్రి పదవులు ఆశించారు. అయితే జగన్ సామాజిక సమీకరణలు , ప్రాంతీయ సమీకరణలు బేరీజు వేసుకుని చాలామంది కొత్తవారిని తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు.

పుష్పశ్రీవాణి - తానేటి వనిత - శంకర్ నారాయణ - గుమ్మనూరు జయరాం లాంటి వాళ్ళతో పాటు ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన అవంతి శ్రీనివాస్ లాంటి నేతలకు కూడా మంత్రి పదవులు దక్కాయి. దీంతో ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న శ్రీకాంత్‌ రెడ్డి -  కొరుముట్ల శ్రీనివాసులు - భూమన కరుణాకర్ రెడ్డి - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి - కాకాణి గోవర్ధన్ రెడ్డి లాంటి నేతలకు మంత్రి పదవి దక్కలేదు.

అయితే ఇప్పుడు జగన్ కేబినెట్ ఏర్పాటు చేసి రెండున్నర సంవత్సరాలు దాటేసింది. మరో నాలుగు నెలల్లో జగన్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి మూడు సంవత్సరాలు అవుతుంది. వాస్తవంగా జగన్ ఇప్పటికే తన మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా రెండు సంవత్సరాలు మంత్రులు ఏం చెయ్యడానికి వీలు లేకుండా పోయింది.

దీంతో తాము మంత్రులుగా ఉన్న చేయలేకపోయామని వారు జగన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారట. చివ‌ర‌కు వారు వారి నియోజ‌క వ‌ర్గాల‌తో పాటు జిల్లాల్లోనూ చిన్న చిన్న ప‌నులు కూడా చేయ‌లేదు. దీంతో  మంత్రి వర్గాన్ని మార్చేందుకు జ‌గ‌న్ మరో ఆరు నెలల సమయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇది నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రులకు బంపర్ ఆఫర్ అని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: