శశికళ ఇకపై అన్నాడీఎంకేలోకి రావడం కష్టంగానే కనిపిస్తోంది. అన్నా డీఎంకే లో జరుగుతున్న ఈ పరిణామాలపై శశికళ మండిపడుతున్నారు. పార్టీ రాజ్యాంగాన్ని పళనిస్వామి, పన్నీర్ సెల్వం మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు దారులన్నీ మూసుకుపోవడంతో శశికళను దిక్కు తోచడం లేదు. ఈ పరిస్థితుల్లో శశికళను బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఈ దశలో శశికళ బీజేపీలో చేరతారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. గతంలో బీజేపీ కోరిక మేరకే ఆమె కొత్త పార్టీ పెట్టడానికి పార్టీ నుంచి దూరమయ్యారు. ఇప్పుడు తిరిగి బీజేపీలోకి వెళ్తారా, వెళ్లినా బీజేపీవాళ్లు రానిస్తారా..? అనేది ఆలోచించాల్సిన విషయమే..
శశికళను తగిలిన ఈ ఎదురుదెబ్బతో శశికళ వర్గం మొత్తం ఆగ్రహంతో ఉంది. పన్నీరుసెల్వం, పళనిస్వామిలను ఎదుర్కోవాలంటే ప్రస్తుతానికి శశికళను ఉన్న శక్తి సరిపోదు. దీంతో శశికళ వర్గంలో మెజారిటీ సభ్యులు బీజేపీలో చేరాలని ఆమెపై ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. ఇప్పుడిప్పుడే అన్నా డీఎంకే పార్టీని చేజిక్కించుకోవడం అసాధ్యంగా కనిపిస్తోందని సంకేతాలు కూడా రావడంతో శశికళ ఆలోచనలోపడ్డారని సమాచారం. అన్నా డీఎంకే పార్టీ చీఫ్ గా పన్నీర్ సెల్వం, డిప్యూటీ చీఫ్ గా పళనిస్వామి ఇకపై వ్యవహరించనుండటంతో శశికళ ఆటలు సాగేలా కనిపించడంలేదు. దీంతో ఇకపై శశికళ బీజేపీలో చేరడం మినహా, వేరే దారిలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.