ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఏపీలో విపక్షాల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియడంతో అన్ని పార్టీలు పూర్తిగా ప్రచారంపై దృష్టి కేంద్రీకరించాయి. ఎందుకంటే రాబోతున్న చివరి రెండు వారాలు వారికి చాలా కీలకం. దాంతో మండుటెండలను కూడా లెక్క చేయకుండా జనంలోకి దూసుకెళ్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఓ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఎటువంటి మేలు జరగలేదనీ పేర్కోవడం కొసమెరుపు.

ఈ క్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ చేసిన వ్యాఖ్యలను బొత్స ఖండించారు. కేంద్రంలో మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏది పడితే అది మాట్లాడటం, నోటికి వచ్చినట్లు విమర్శలు చేస్తే మూల్యం చెల్లించుకుంటారని వార్నింగ్ ఇచ్చారు. ఏపీలో విద్యా మంత్రిత్వ శాఖపై కొన్ని పత్రికలు దురుద్దేశంతోనే తప్పుడు కథనాలు రాస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క అధ్యాపకుడు కూడా విద్యాశాఖలో అవినీతి జరిగిందని ఫిర్యాదు చేశారా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో రికార్డు స్థాయిలో ఫలితాలు వచ్చాయని, ఎక్కడా చిన్నపాటి పొరపాటు కూడా లేకుండా పరీక్షలు నిర్వహించామని బొత్స గుర్తు చేశారు.

ఎలక్టోరల్ బాండ్స్‌ రూపంలో దేశంలోనే అతి పెద్ద అవినీతి బీజేపీ చేసింది అని బొత్స ఆరోపించారు. దళితుల రిజర్వేషన్లు తగ్గించాలని చూస్తే బీజేపీ ఈ పరువు మట్టి కొట్టుకుపోతుందని బొత్స ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. ఏదిఏమైనా తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని బొత్స ఇక్కడ అనడం శోచనీయం. రాష్ట్రానికి మంచి జరుగుతుందని అంటే ఎలాంటి అంశానికైనా తాము మద్దతు ఇస్తామని, అందుకే కేంద్రంలో తమ వైఎస్ఆర్సీపీపై ఆధారపడే పార్టీ రావాలని కోరుకుంటున్నామని బొత్స ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ప్రస్తుతం మనం అడిగితే పనులు అయ్యే పరిస్థితి కేంద్రంలో లేదని, కేంద్రం అన్నీ రాజకీయ కోణంలో ఆలోచిస్తుందని, అందుకే వైసీపీపై ఆధారపడే ప్రభుత్వం రావాలని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: