తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటోంది. ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్టీపై తీవ్రమైన విమర్శలు చేసిన ఆయన, ఇప్పుడు మాత్రం సైలెంట్ గేమ్ ఆడుతుండటం రాజకీయ పిచ్చచర్చకు దారితీస్తోంది. ఇటీవల ఓ మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ, రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి మళ్లీ దగ్గరవుతున్న సంకేతాలుగా భావిస్తున్నారు. “ధర్మం కోసం పని చేసే ఏకైక పార్టీ బీజేపీనే. నేను ఎలాంటి రాజకీయం లేకుండానే దేశం కోసం పోరాడుతున్నా. మిగతా పార్టీలన్నీ ఎంఐఎంతో కలిసి పనిచేస్తున్నాయి. అలాంటి పార్టీలలోకి వెళ్లే ప్రసక్తే లేదు” అంటూ వ్యాఖ్యానించారు.


అంతేకాకుండా నరేంద్ర మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో పనిచేయడానికి తాను సిద్ధమని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, “రాజాసింగ్ తిరిగి బీజేపీలోకి ఎంట్రీ ఇస్తున్నారా?” అనే ప్రశ్నకు బలం చేకూరుతోంది. రాజీనామా సమయంలో బీజేపీ టాప్ లీడర్లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్, ప్రస్తుతం ఒక్క మాట కూడా మాట్లాడకుండా శాంతంగా ఉండడమే చర్చనీయాంశంగా మారింది. ఇక మాధవీలత వ్యవహారంపై కూడా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాజాసింగ్‌పై నెగటివ్ కామెంట్లు చేసిన మాధవీలతకు పార్టీ నేతలు హితబోధ చేశారు అన్న వార్తలు వెలుగుచూస్తున్నాయి. సైలెంట్ గా ఉండాలని ఆమెకు సూచించారని సమాచారం. దీన్నిబట్టి చూస్తే బీజేపీ  రాజాసింగ్‌ను మళ్లీ తమ గూటికి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


ఈ పరిణామాల మధ్య, రాజాసింగ్ తిరిగి బీజేపీలో వ‌స్తార‌? లేక మళ్లీ నూతన పార్టీతో ముందుకు సాగాలనుకుంటున్నారా ? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇప్పటికీ ఆయన బీజేపీకి బలమైన హిందూత్వ ముద్రతో కూడిన నేతగానే గుర్తింపు ఉన్న నేపథ్యంలో, పార్టీ కూడా తిరిగి స్వీకరించేందుకు ఆసక్తిగా ఉందని సమాచారం.సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ... తెలంగాణలో హిందూత్వ ఓటును కాపాడేందుకు బీజేపీకి రాజాసింగ్ మళ్లీ అవసరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్లీ పార్టీలోకి రావడానికి రాజాసింగ్ కూడా అంగీకరిస్తే, ఇది కమలం పార్టీకి మరో బలపొందిన అడుగవుతుంది. చివరగా చెప్పాలంటే – రాజాసింగ్ పాజిటివ్ సిగ్నల్స్, బీజేపీ హుందాగా సమాధానం.. ఈ కలయికకు అధికారిక ముద్ర పడేదెప్పుడో చూడాలి!


మరింత సమాచారం తెలుసుకోండి: