2024 ఎన్నికల్లో జనసేన పార్టీకి వచ్చిన విజయంతో అధిక ఉత్సాహంలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇప్పుడు పార్టీ పరిపాలనపై దృష్టి సారించారు. శాసనసభలో ప్రతిపక్ష గళంగా నిలబడిన అనుభవాన్ని పార్టీ కార్యకర్తలకు మరింత బలోపేతంగా మార్చాలన్న కసితో, పవన్ కళ్యాణ్ అగస్టులో కీలక కార్యాచరణ చేపట్టనున్నారని సమాచారం. ఇందులో భాగంగా పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యాచరణపై, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు చేపట్టిన పవన్ కళ్యాణ్, అందిన నివేదికల ఆధారంగా చాలామందిపై అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. జనసేన తరఫున గెలిచిన 20 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 15 మందిపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్లు తేలిందట.


ప్రజలతో సంబంధం లేకుండా, అభివృద్ధి పనుల్లో చురుగ్గా పాల్గొనకపోవడం, క్షేత్రస్థాయిలో ఫాలో అప్ లేకపోవడం లాంటి అంశాలపై పవన్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఈ క్రమంలో ఆయా ఎమ్మెల్యేలకు క్లాస్ పీకేందుకు పవన్ సిద్ధమయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న నాలుగేళ్లలో వారు మెరుగైన ప్రదర్శన చేయకపోతే 2029లో టిక్కెట్ల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటానని వారిని స్పష్టంగా హెచ్చరించనున్నారని తెలుస్తోంది.  ఇక రాజధాని అంశంలోనూ పవన్ కళ్యాణ్ తనదైన స్పష్టతను కనబరిచారు. అమరావతికి అదనంగా భూములు ఇవ్వడంపై కొంత సానుకూలత ఉన్నా, బలవంతపు సేకరణను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల అభిప్రాయాన్ని గౌరవించాలన్న దృష్టితో మీడియా ముందు కూడా తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు.


ఇది కూటమిలో భాగస్వామిగా ఉన్నా, పవన్ కళ్యాణ్ తన సిద్ధాంతాలపై మాత్రం రాజీపడే ఉద్దేశం లేదన్న సంకేతంగా రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఇన్నాళ్లు సినిమాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు పూర్తిగా పార్టీకి సమయం కేటాయించనున్నారని తెలిసింది.ఇలా పార్టీకి ఉన్న ప్రజాదరణను ప‌రింత పెంచెందుకు నిమగ్నమయ్యారని చెబుతున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ కమిటీల ఏర్పాటుతో పాటు, యువజన బ్రిగేడ్‌ని కొత్తగా రూపొందించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా మొత్తానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం మరోసారి డైనమిక్‌గా మారేందుకు సిద్ధమవుతున్నా, ఆయన తీసుకునే హెచ్చరికలు, నిర్ణయాలు పార్టీని మరింత ప్రభావవంతంగా మార్చే దిశగా కొనసాగుతాయని ఆశిస్తున్నారు రాజకీయ పరిశీలకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: