తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ‌ రాజకీయాలకు ఇది తక్కువ కాకపోయినా, రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపించేలా వాతావరణం మారుతోంది. హైదరాబాద్‌ నగరంలోని ఈ హై ప్రొఫైల్ నియోజకవర్గం తాజా ఉప ఎన్నికతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠకు దారితీస్తోంది. ఇటీవలి సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయం సాధించిన ఎన్డీయే కూటమి, ఇప్పుడు తెలంగాణలో అడుగుపెట్టాలని, ముఖ్యంగా జూబ్లీహిల్స్‌ లాంటి కీలక స్థానం నుంచే ఆరంభించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. ఇందులో ముఖ్య పాత్రధారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కావడం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.

ఎన్నికల వ్యూహంపై ఫోకస్ .. ఇప్పటికే తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని మళ్లీ చక్కదిద్దేందుకు బాబు తన సీనియర్ నాయకులతో కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వాలంటే, హైదరాబాద్‌లో ఓ సీటు గెలవడమే బెస్ట్ మూవ్‌ అని భావిస్తున్నారు. ఆ దిశగా చంద్రబాబు వ్యూహ రచనలో నిమగ్నమయ్యారు. అలాగే జూబ్లీహిల్స్‌లో టీడీపీకి ఉండే ఓటు బ్యాంక్, ఇప్పటికీ కొంత మేర నిలిచే అవకాశం ఉందన్న విశ్వాసంతో పార్టీ కార్యచరణలో ఉంది. బీజేపీ – జనసేనతో కలిసి? ..  తెలంగాణలో కూడా కూటమి ఫార్ములాను ఫాలో అవుతామా అన్న దానిపై స్పష్టత రాకపోయినా, తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారని సమాచారం. ఇక బీజేపీతో చర్చలు, జనసేన మద్దతు పైనా టాక్ నడుస్తోంది. మొత్తానికి జూబ్లీహిల్స్‌ను ఓ రిప్యూటేషన్ టెస్ట్‌గా తీసుకుని ఎన్డీయే ఏకమై బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


టీడీపీ చొరబాటుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో కదలికలు మొదలయ్యాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌ వాసుల అభిరుచులకు తగిన అభ్యర్థిని రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ తాజాగా తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటికీ, నగర పరిధిలో బలహీనంగా ఉంది. బీఆర్ఎస్ మాత్రం ఈ స్థానం కోల్పోతే హైదరాబాద్‌లో మూడో స్థానానికి జారిపోతుందన్న భయంతో ఉంది. ఇలా మొత్తం మీద .. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చంద్రబాబు రంగంలోకి దిగడంతో రాజకీయ వేడి  పెరిగింది. ఇది టీడీపీకి రీఎంట్రీ ఆరంభమా ? లేక మరోసారి నెగటివ్ షాక్  అవుతుందా ? అన్నది త్వరలో తెలుస్తుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: