రాష్ట్ర మహిళలకు ఇది నిజమైన స్వాతంత్ర్య దినోత్సవ బహుమతి! ఆగస్టు 15వ తేదీ నుంచి ఏపీ రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. మంగళవారం (6న) జరగనున్న మంత్రివర్గ సమావేశంలో తుది ఆమోదం లభించనున్నట్లు సమాచారం. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు జీరో ఫెయిర్ టికెట్‌తో ప్రయాణించవచ్చు. ప్రస్తుతం ఆర్టీసీకి చెందిన 11,449 బస్సులలో 8,548 బస్సులు ఈ పథకం కింద పనిచేయనున్నాయి. అంటే, మొత్తం బస్సులలో 74 శాతం బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలులోకి రానుంది.

పథకాన్ని ప్రారంభించిన వెంటనే భారీ రద్దీ ఏర్పడే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా మొదటి మూడు నెలలు అధిక సంఖ్యలో మహిళలు ప్రయాణించే అవకాశం ఉందన్న అంచనాతో డ్రైవర్లు, కండక్టర్లకు ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తున్నారు. మగవారికి మామూలు టికెట్ ఇవ్వగా, మహిళలకు ప్రత్యేకంగా జీరో టికెట్లు ఇవ్వనున్నారు. భర్త భార్య కలిసి ప్రయాణిస్తే... భర్తకు చార్జీ ఉన్న టికెట్, భార్యకు జీరో టికెట్ వేర్వేరుగా ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకత ఏంటంటే... ఈ పథకం ఏపీకి చెందిన మహిళలకే పరిమితం. ప్రభుత్వ గుర్తింపు కార్డుతో రుజువు చేసినవారికే ఉచిత ప్రయాణ హక్కు ఉంటుంది. అంటే ఎలాంటి గందరగోళం లేకుండా బస్సులో మహిళ ఎవరో ముందే క్లియర్ చేసేందుకు ఆర్టీసీ చక్కటి ప్రణాళికను రూపొందించింది.

ఈ పథకం రాష్ట్రంలోని లక్షలాది పేద, మధ్య తరగతి మహిళలకు వరం లాంటి సేవ కానుంది. ఉద్యోగం, చదువు, కుటుంబ అవసరాల కోసం ప్రతిరోజూ ప్రయాణించే మహిళలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. ఇదిలా ఉంటే... గతంలో తెలంగాణలో అమలైన ‘మహిళల ఉచిత బస్సు ప్రయాణం’ పథకాన్ని రిఫరెన్స్‌గా తీసుకుని మరింత విస్తృతంగా దీనిని ఏపీలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తానికి... ఈ ఆగస్టు 15న మహిళలకు నిజమైన స్వాతంత్ర్య ప్రయాణం కానుంది. ఓ పల్లెటూరి అమ్మ నుంచి పట్టణానికి పనికెళ్లే యువతీ వరకు – బస్సులో ప్రతి సీటు వెనక ఓ నవ్వు కనిపించబోతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: