ఢిల్లీ బాంబు పేలుళ్లు దేశవ్యాప్తంగా భారీ సంచలనం రేపాయి. రాజధానిలో చోటుచేసుకున్న ఈ దారుణ సంఘటన ఒక క్షణంలోనే ప్రజలను ఆందోళనకు గురి చేసింది. పేలుళ్ల వెనుక పనిచేసిన ఉగ్రవాద ముఠాల యత్నాలు, కుట్రలు భద్రతా వ్యవస్థలకు సవాల్‌గా మారడంతో అధికారులు వెంటనే అలర్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తూ, అన్ని ముఖ్య ప్రాంతాల్లో నిఘాను పెంచారు.ఈ నేపథ్యంలో, వివిధ రాష్ట్రాల్లో దాడులు, సోదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ముంబైలో ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, ఛత్తీస్‌గఢ్‌లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్  ఇద్దరు మైనర్ బాలురను అదుపులోకి తీసుకుంది. వీరిద్దరికీ ఉగ్రవాద సంస్థ **ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా **తో సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది.


ఉప ముఖ్యమంత్రి విజయ్‌ శర్మ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మైనర్లు పాకిస్థాన్‌కు చెందిన ఐసిస్ హ్యాండ్లర్‌ మార్గనిర్దేశంలో పనిచేస్తున్నారు. నకిలీ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఉగ్రవాద భావజాలం, విద్వేష కంటెంట్‌ను పంచుతూ ఇతరులను కూడా ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు గుర్తించబడింది. అంతేకాదు, స్థానికంగా ఉన్న మరికొంత మంది చిన్నారులను కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తున్నారన్న వివరాలు వెలుగులోకి వచ్చాయి.ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్న మైనర్లను గుర్తించడం ఇదే తొలిసారి అని యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో, ఇంకా ఇలాంటి యువకులు ఇతర ప్రాంతాల్లో ఉన్నారా అన్న దిశగా దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా రాయ్‌పూర్, భిలాయి, దుర్గ్‌ వంటి ఛత్తీస్‌గఢ్ ముఖ్య నగరాల్లో ప్రత్యేక గాలింపులు జరుగుతున్నాయి.



దర్యాప్తు సంస్థల నివేదికల ప్రకారం, పాకిస్థాన్‌లోని ఐసిస్ మాడ్యూల్ భారత్‌లో యువతను లక్ష్యంగా చేసుకుని పలు నకిలీ సోషల్ మీడియా ఐడీలను నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది. ఈ ఖాతాల ద్వారా మత విద్వేషం, తీవ్రవాదం, రాడికలైజేషన్‌కు దారితీసే సందేశాలను పంపుతూ మానసిక ప్రభావం చూపే ప్రయత్నం చేస్తున్నారు.ఢిల్లీ పేలుళ్ల కేసు మూలాలు దేశంలోని అనేక రాష్ట్రాలకు వ్యాపించి ఉండడంతో, అన్ని ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. తాజాగా డిజిటల్ ఫుట్‌ప్రింట్స్, సోషల్ మీడియా కార్యకలాపాల ద్వారా ఈ కుట్రలో పాలుపంచుకున్న మరికొందరిని గుర్తించడంపై కేంద్ర సంస్థలు దృష్టి సారించాయి. ముంబై పోలీసు వర్గాలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించాయి.



ఇదిలా ఉండగా, “ఇంత చిన్నవాళ్లు కూడా ఉగ్రవాద కార్యక్రమాల్లోకి జారిపోతున్నారా?” అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు హిందువులను టార్గెట్ చేస్తున్నారని మండిపడుతున్నారు. చిన్నారులను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాద సంస్థలు వల వేస్తున్నాయి అన్న విషయం ఆందోళనకరమని సామాజిక వర్గాలు తీవ్రంగా మండిపడుతున్నారు.దేశ భద్రతకు ప్రమాదం కలిగించే ఏ చిన్న సూచన వచ్చినా వెంటనే దాన్ని అరికట్టేందుకు అధికారులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. ఉగ్రవాద జాలాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలన్న సంకల్పంతో భద్రతా దళాలు ఇప్పటికంటే మరింత అప్రమత్తంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: