సంగారెడ్డి రాజకీయాల్లో సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీసుకున్న తాజా నిర్ణయం తెలంగాణ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భవిష్యత్తులో తాను సంగారెడ్డి నుండి పోటీ చేయబోనని, ఒకవేళ తన భార్య బరిలో నిలిచినా ఆమె తరపున ప్రచారం కూడా నిర్వహించబోనని ఆయన ఓపెన్‌గానే చెప్పేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా జ‌గ్గారెడ్డి కోసం సంగారెడ్డిలో ప్రచారం చేసినా.. స్థానిక ప్రజలు తనను ఓడించడం పట్ల జగ్గారెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సైతం పార్టీ తరపున ప్రచారం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఓడించిన ప్రజలకు తన సేవలు అందకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఈ రకమైన మొండి వైఖరిని అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది.


జగ్గారెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటర్లు ఇచ్చే తీర్పును గౌరవించాల్సింది పోయి, ఇలా ప్రజల మీద అలగడం సరికాదంటున్నారు. జ‌గ్గారెడ్డి వ్యాఖ్య‌లు 'చెరువు మీద అలిగినట్లు' ఉందని పలువురు కాంగ్రెస్ నాయకులు సెటైర్లు వేస్తున్నారు. ఒక నాయకుడు తప్పుకుంటే ఆ స్థానంలో పోటీ చేసేందుకు ప‌లువురు నేతలు సిద్ధంగా ఉంటారని.. ఇప్పుడున్న పోటీ యుగంలో ఒక్క‌సారి జ‌గ్గారెడ్డి త‌ప్పుకుంటే ఆయ‌న రాజ‌కీయాల‌కు ఆయ‌నే స‌మాధి క‌ట్టుకున్న‌ట్టు అవుతుంద‌న్న సెటైర్లు కూడా ప‌డుతున్నాయి.


తాను లేకపోతే సంగారెడ్డి అభివృద్ధి కుంటుపడుతుందనే భ్రమలో జగ్గారెడ్డి ఉండటం ఆయన అతివిశ్వాసానికి నిదర్శనమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదనే వాస్తవాన్ని ఆయన విస్మరిస్తున్నట్లు తెలుస్తోంది. 2018 ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రభుత్వం జగ్గారెడ్డిని నకిలీ పాస్‌పోర్టు కేసులో జైలుకు పంపినప్పుడు.. ఇప్పుడు తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ఆయన కోసం తీవ్రంగా పోరాడాయి. ఈ క్ర‌మంలోనే 2018 ఎన్నిక‌ల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడినా జగ్గారెడ్డి మాత్రం సంగారెడ్డిలో విజయం సాధించగలిగారు. గ‌త 2023 ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి బలంగా వీచినా, సొంత పార్టీ అధికారంలోకి వచ్చినా జగ్గారెడ్డి మాత్రం పరాజయం పాలయ్యారు.


ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే తనకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కేదని, ఆ అవకాశాన్ని ప్రజలే దూరం చేశారని ఆయన మనస్తాపానికి గుర‌య్యారు. అందుకే ఆయ‌న ప‌దే ప‌దే సంగారెడ్డి ఓట‌ర్ల‌ను విమ‌ర్శిస్తూ వ‌స్తున్నారు. జగ్గారెడ్డి ప్రకటన వెనుక కేవలం ఓటమి బాధ మాత్రమే కాకుండా పార్టీలో ప్రాధాన్యత తగ్గడం కూడా ఒక కారణమని ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తనకు ఆశించిన స్థాయిలో పట్టు లభించలేదని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.


9490520108.. ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మ‌స్య‌లు, ఎమ్మెల్యేల ప‌నితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్ర‌జ‌ల ఇబ్బందులు, అక్క‌డ అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల ప‌రిస్థితులు, రాజ‌కీయ అంశాల‌పై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: