శబరిమల యాత్ర మార్గదర్శకాలు:
* శబరిమలకు రాదలచిన భక్తులు ముందుగానే కేరళ పోలీస్ శాఖ అభివృద్ధి చేసిన వర్చువల్ క్యూ పోర్టల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్:https://sabarimalaonline.org
* వారాంతాల్లో రోజుకు 2000 మంది, ఇతర రోజుల్లో రోజుకు 1000 మంది చొప్పున భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. వెబ్సైట్లో ఈ మేరకే రిజిస్టర్ చేసుకునే వీలు కల్పించారు. పరిస్థితులను బట్టి మార్పులు ఉంటాయి.
* దర్శనానికి 48 గంటల ముందు తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. అందులో నెగటివ్ వచ్చిన వారినే దర్శనానికి అనుమతిస్తారు. ప్రవేశమార్గంలోనూ యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తారు.
* స్వామికి నెయ్యి అభిషేకాలు, పంపా నదిలో స్నానాలు, సన్నిధానంలో రాత్రి బస చేయడం లాంటి వాటిని అనుమతించరు.
* కేవలం ఎరుమేలి, వడసెర్రికర మార్గాల్లో మాత్రమే అయ్యప్ప భక్తులను అనుమతిస్తారు. మిగతా అన్ని మార్గాలను తాత్కాలికంగా మూసివేస్తారు.
* 10 ఏళ్ల లోపు పిల్లలు, 60 సంవత్సరాలు నిండిన వారిని దర్శనానికి అనుమతించరు. గుండె సమస్యలు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా శబరిమల యాత్రకు రాకూడదు.
* యాత్రకు వచ్చిన వాళ్లు తమతో ఆయుష్మాన్ భారత్, బీపీఎల్ తదితర ఆరోగ్య బీమా కార్డులను వెంట తెచ్చుకోవాలి.
ఈ మార్గదర్శకాలను ఆయా రాష్ట్రాల్లో స్థానిక భాషల్లో ప్రచురించి, అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశ్వాస్ మెహతా కోరారు. ఈ మేరకు గురువారం (అక్టోబర్ 15) ఓ ప్రకటన విడుదల చేశారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్తో శబరిమల యాత్రను కొన్ని నెలల పాటు నిలిపివేశారు. ఆ తర్వాత నిబంధనలు సడలించడంతో దర్శనాలకు అనుమతి ఇచ్చారు. అనంతరం కరోనా కేసులు మళ్లీ పెరగడంతో వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత పలు నిబంధనలతో యాత్రకు అనుమతు ఇస్తున్నారు. కేరళలో తగ్గినట్టే కనిపించిన కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. దేశంలో తొలి కేసు ఇక్కడే నమోదైన సంగతి తెలిసిందే. అయితే.. కేరళ ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యలతో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చింది. కానీ, లాక్డౌన్ సడలింపుల అనంతరం ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వారు కేరళకు తిరిగి రావడంతో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా అక్కడ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులు స్వీయ నియంత్రణ పద్ధతులు పాటించడం తప్పనిసరి.