మనం ఈ లోకంలోకి ఎందుకొచ్చామని ప్రశ్నించుకుంటే- ఎవరినుంచీ ఏ మార్గంలోనూ సమాధానం దొరకదు. . ఒక్క ఆధ్యాత్మిక మార్గంలో తప్ఫ జీవితం రూపంలో లభ్యమైన ఇంత అమూల్యమైన ప్రయాణాన్ని ఇంత అర్థంలేని, ఇంత చవిలేని, ఇంత నిరర్థకమైన గమ్యం కోసమే చేశామని అర్థమై, వచ్చిన దారివైపు, ఆ చివర మొదలు పెట్టిన స్థానం వైపు చూస్తే - ఎంత అనాలోచితంగా, ఇంత అలవోకగా చేశామేమిటని... మన అజ్ఞానానికి మనమే సిగ్గుపడతాం.  ఒక పనిని లేదా కార్యాన్ని చేయాలనుకున్నప్పుడు తగినదాన్ని ఎన్నుకునే అవకాశం చాలావరకు మనకుంది. అల్లాటప్పా పని కాకుండా అమూల్యమైనదాన్ని, మన శ్రమకు తగిన ఫలితం ఇవ్వగలిగేదాన్ని ఎన్నుకోవాలి....

 మానవ జన్మ మనం ఎన్నుకున్నది కాకపోయినా (నిజానికి లోతుగా ఆలోచిస్తే అది మనం ఎన్నుకున్నదే....కర్మ ఫలాల ఫలితంగా)- దాన్ని ఎలా జీవించాలనే విషయం, దేనికి ఉపయోగించుకోవాలనే విషయం, నిర్ణయం మన మేధా పరిధిలోనే ఉంది. అంత మంచి వెసులుబాటును మనం సవ్యంగా వినియోగించుకోలేకపోతే మనకంటే మూర్ఖులు మరెవరూ ఉండరు. ఈ లోకంలో లాభనష్టాలు, గెలుపోటముల ప్రసక్తి లేనిది కేవలం ఆధ్యాత్మిక రంగం మాత్రమే. ఒకే ఒక సంకల్పం, ఏకసూత్రం... స్వస్థానాన్ని, శాశ్వత ధామాన్ని చేరుకోవడం. పరమాత్మ పాదాల చెంత నిర్వికల్ప విశ్రాంతిని, శాశ్వత ఉపశాంతిని పొందడం.

మార్గం ఒకటే అయినా మార్గమధ్యాన్ని నిరాటంకం, కంటకరహితం చేసుకోవలసి ఉంది....మలుపులు, మారు మార్గాంతరాలు లేకపోయినా మన మనసు చేసిన మార్గ నిర్దేశాన్ని అనుసరిస్తూనే మన అడుగు వేయబోయే ...మన ముందరి భాగాన్ని ప్రయాణ సౌలభ్యంగా మలచుకోవలసి ఉంది. ...దాని ఉద్దేశం- రేపటి ప్రయాణికులకు సానుకూలం చేయడం కూడా అయిఉండాలి. ప్రతి మానవ ప్రయత్నానికీ అందరి శ్రేయస్సు కూడా లక్ష్యమై ఉండాలి. ఇదే మానవ జీవన ప్రయాణ ఉద్దేశం, భగవన్నిర్దేశం కూడా....నిజానికి తాను ఆత్మనని తెలుసుకునేవరకు- తాను ఒక్కడు కాదు, అనేకం, అనేకానేకం. తాను ఆత్మనని గ్రహించిన క్షణమైతే... ప్రతి అణువూ తానే. శ్రీరామకృష్ణులు అలాంటి ఆత్మభావంతో లయమైనప్పుడే పరమహంస కాగలిగారు....

 

మరింత సమాచారం తెలుసుకోండి: