ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే వేద మంత్రోచ్ఛరణ, సాయి నామస్మరణతో ప్రాంతమంతా భక్తి వాతావరణం అలుముకుంది. ఈ సందర్భంగా 31.8 అడుగుల ఎత్తయిన అద్భుతమైన వెండి రథంపై ప్రతిష్ఠించిన 9.2 కిలోల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రథోత్సవాన్ని చూడటానికి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. ఈ మహోత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ప్రపంచ శాంతి కోసం సత్యసాయి మహాసమాధి వద్ద ఏకకాలంలో 1,100 జంటలు సత్యనారాయణ వ్రతం నిర్వహించడం ఈ వేడుకలకు ప్రత్యేక శోభను తెచ్చింది.


ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్వామివారి స్ఫూర్తిని స్మరించుకుంటూ మనసును తాకేలా ప్రసంగించారు. “ప్రజలను జడ్జ్ చేయకూడదు, వారిని అర్థం చేసుకోవాలి అన్న సందేశాన్ని సత్యసాయి బాబా ఎల్లప్పుడూ ముందుకు పెట్టేవారు. ఆ ఆలోచనలను మన రోజువారీ జీవితంలో అమలు చేస్తే అనేక సమస్యలు సహజంగానే తగ్గిపోతాయి’’ అని ఆయన తెలిపారు. అలాగే, సత్యసాయి బాబా సేవాభావాన్ని గుర్తుచేసుకుంటూ సచిన్ .. “ప్రజలకు సేవచేయడమే స్వామివారి నిజమైన లక్ష్యం. శారీరక ఆరోగ్యం మాదిరిగానే మానసిక ఆరోగ్యం కూడా ఎంత ముఖ్యమో ఆయన ఎప్పుడూ చెప్పేవారు. బలహీన వర్గాలకు సాయం చేయడమే నిజమైన విజయమని స్వామివారి దగ్గరకు వెళ్లిన ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు" అని అన్నారు.



2011 వరల్డ్‌కప్ సందర్భంగా తన అనుభవాన్ని పంచుకుంటూ సచిన్ ..“ఆ సమయంలో భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉండేవి. మేము బెంగళూరులో ఉన్నప్పుడు స్వామి ఫోన్ చేసి ఆశీర్వదించారు. అనంతరం ఒక పుస్తకం పంపించారు. ఆ పుస్తకం నాకు సానుకూల దృక్పథాన్ని, అపారమైన స్ఫూర్తిని ఇచ్చింది. ఆ శక్తిస్థాయే మా జట్టును ఆ వరల్డ్‌కప్ గెలిచేలా నడిపింది. అది నా జీవితంలోని గోల్డెన్ మూమెంట్" అని టెండూల్కర్ భావోద్వేగంగా గుర్తు చేసుకున్నారు. పుట్టపర్తి శతజయంతి ఉత్సవాలు ఇంకా కొన్ని రోజుల పాటు భక్తి శ్రద్ధలతో కొనసాగనున్నాయి. దేశం నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా వేలాది మంది భక్తులు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: