మహిళలు గర్భం దాల్చినప్పుడు చాల జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక మహిళలకు భక్తి భావం అధికంగా ఉంటుంది. పూజలు, వ్రతాలు చేయడంలో శ్రద్ధ చూపిస్తారు. నిత్యం పూజ కోసం పూలు కోసి మాలగా కట్టి భగవంతునికి సమర్పించడంలో సంతోషాన్ని, సంతృప్తిని పొందుతారు. పూజలు, వ్రతాలు, అభిషేకాలంటూ చుట్టుపక్కల వారితో కలిసి దేవాలయాలకు వెళుతూ ఉంటారు.

ఇక స్త్రీలు గర్భాన్ని ధరించినప్పుడు పూజలు, వ్రతాలు చేయవచ్చా? లేదా ? అనే సందిగ్ధంలో పడుతుంటారు. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో సలహా ఇవ్వడంతో వాళ్లు మరింత తికమకపడుతుంటారు. ఈ సందేహానికి సమాధానం శాస్త్రంలో కనిపిస్తుంది. గర్భవతులు తేలికపాటి పూజా విధానాన్ని అవలంభించాలనీ కొబ్బరికాయను మాత్రం కొట్టకూడదని, గుడి చుట్టు ప్రదక్షిణాలు చేయకూడదని చెబుతోంది. కొత్త పూజా విధానాలను ఆరంభించడం గానీ పుణ్యక్షేత్రాల దర్శనం చేయకూడదు.

అయితే కోటిసార్లు పూజచేయడం కన్నా ఒక స్తోత్రం చదవడం, కోటి స్తోత్రాలు చదవడంకన్నా ఒకసారి జపం చేయడం, కోటిసార్లు జపం చేయడం కన్నా ఒకసారి ధ్యానం చేయడం వలన ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది. అందువలన గర్భవతులు ధ్యానం చేయడం అన్ని విధాలా మంచిదని సూచిస్తోంది. గర్భవతులకి పూజల విషయంలో ఈ నియమం విధించడం వెనుక వారి క్షేమానికి సంబంధించిన కారణమే తప్ప మరొకటి కనిపించదు.

అంతేకాక 5వ నెల వచ్చే వరకు వ్రతాలు చేయవచ్చని, ఆ తర్వాత చేయకూడదని శాస్త్రం చెబుతోంది. పూజలు, వ్రతాలు పేరుతో వాళ్లు ఎక్కువ సేపు నేలపై కూర్చోవడం మంచిది కాదనే ఈ నియమం చేసినట్టు తెలుస్తోంది. ఇక పుణ్య క్షేత్రాలు చాలా వరకూ కొండలపై వుంటాయి. అక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా వుంటుంది. అలాంటి ప్రదేశాలకు వెళ్లడం వలన ఇబ్బందులుపడే అవకాశం ఎక్కువగా ఉన్నందు వల్లనే ఈ నియమాన్ని విధించినట్టు స్పష్టమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: