సాంకేతికంగా మనం ముందంజలో ఉండాలి.. ప్రపంచ దేశాలకు మనం మార్గదర్శకంగా ఉండాలంటూ ఊదరగొట్టే కేంద్ర ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఎప్పుడూ వెనకబడే ఉంటుంది. సాంకేతికంగా ముందుండాలంటే స్పెక్ట్రంను సంస్థలకు అందుబాటులో ఉంచితేనే సాధ్యమవుతుంది. విభిన్నమైన ఆలోచనల మధ్య పాలకులుంటే పురోగతి సాధ్యపడదు. మనదేశంలో ఐదు సంవత్సరాల తర్వాత ఘనత వహించిన కేంద్ర ప్రభుత్వం స్పెక్ట్రం వేలం ప్రారంఛించింది. మొదటి రోజు సోమవారం రూ.77,146 కోట్ల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. బిడ్స్ దాఖలు చేసిన వాటిలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలున్నాయి.
రూ.3.92 లక్షల కోట్ల విలువైన 2250 MHz ను ఏడు బాండ్లలో కేంద్రం అందుబాటులో ఉంచింది. తొలి రోజు రూ.77,146 కోట్ల విలువ చేసే బిడ్స్ దాఖలయ్యాయని టెలికం మంత్రి రవిశంకర ప్రసాద్ తెలిపారు. బిడ్డింగ్ స్పందన ప్రభుత్వం ఊహించిన దానికంటే మెరుగ్గా ఉందన్నారు 700, 2500 మెగాహెర్ట్జ్ బాండ్లకు ఎవరూ బిడ్లు దాఖలు చేయలేదు. 800, 900, 1800, 2100, 2300 MHz ఫ్రీక్వెన్సీ బాండ్స్కు బిడ్స్ వచ్చాయని, వేలం కొనసాగుతుందని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. 2016 వేలంలో పూర్తిగా అమ్ముడుపోని 700 MHz స్పెక్ట్రం మొత్తం స్పెక్ట్రంలో మూడోవంతు భాగాన్ని ఆక్రమించాయి.
కొత్త స్పెక్ట్రం బాండ్కు వెళ్తే సామగ్రిపై అదనపు వ్యయం ఖర్చు చేయాల్సి ఉండటంతో ఆపరేటర్లు దూరంగా ఉంటున్నారని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. సబ్ గిగాహెర్ట్జ్ బాండ్స్ తక్కువ ధరలకే లభిస్తుందని సమాచారం. ప్రీమియమ్ బ్యాండ్స్ 700, 2500 MHz స్పెక్ట్రం కోసం ఏ కంపెనీ బిడ్ చేయలేదు. స్పెక్ట్రంకు మూడు సంస్థలే పోటీపడుతున్నాయని, అదీ గత స్పెక్ట్రంనే పొడిగించుకుంటున్నాయని, కాబట్టి బిడ్స్ రూ.45,000 కోట్ల స్థాయిలో ఉండవచ్చని అంచనా వేశారు. అయితే దానికి మించి బిడ్స్ వచ్చాయి. బిడ్స్ వారీగా వివరాలు తెలియనప్పటికీ దాదాపు 849.20 MHz పరిమాణానికి బిడ్లు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.