యూనియన్ ఏర్పాటు, సమ్మెకు దిగడం చట్టవిరుద్ధమని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా నోటీసుల్లో స్పష్టం చేశారు. సమ్మె విషయమై అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తో కూడా సమావేశమయ్యారు. కార్యదర్శుల సమ్మె గురించి సీఎంకు మంత్రి ఎర్రబెల్లి వివరించారు. అయితే జేపీఎస్ల సమ్మెపై సీఎం మండిపడినట్టు తెలిసింది.
అందుకే సీఎంతో భేటీ తర్వాత జేపీఎస్ లకు సందీప్ కుమార్ సుల్తానియా నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వంతో జేపీఎస్ లు చేసుకున్న ఒప్పంద బాండ్ ను ఉల్లంఘిస్తూ యూనియన్గా ఏర్పడి, ఏప్రిల్ 28 నుండి సమ్మెకు దిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. జూనియర్ పంచాయితీ సెక్రటరీగా, సంఘాలు, యూనియన్ లలో చేరబోనని సంతకం చేశారని సందీప్ కుమార్ సుల్తానియా నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ ఒప్పందం ప్రకారం పంచాయతీ కార్యదర్శులకు ఆందోళన చేసే, సమ్మెకు దిగే హక్కు లేదని సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు. వాస్తవాలు తెలిసినప్పటికీ యూనియన్గా ఏర్పడి చట్టవిరుద్ధంగా ఏప్రిల్ సమ్మెకు వెళ్ళారని సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగడం వల్ల జేపీఎస్ లు ఉద్యోగాల్లో కొనసాగే హక్కును కోల్పోయారని సందీప్ కుమార్ సుల్తానియా స్పష్టం చేశారు. మానవతా దృక్పథంతో వారికి చివరి అవకాశం ఇస్తున్నట్లు సందీప్ కుమార్ సుల్తానియా నోటీసుల్లో తెలిపారు. ఈ సాయంత్రం ఐదు గంటలలోపు విధుల్లో చేరాలని జేపీఎస్ లని ప్రభుత్వం ఆదేశించింది.