ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలవబోతున్నట్టు తెలుస్తోంది. అమిత్‌ షా అపాయిట్మెంట్ ఫిక్స్ అయ్యిందట. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే.. జగన్ సాధారణంగా ఎప్పుడు వచ్చిన ఎక్కువగా అమిత్‌ షానే కలుస్తుంటారు. సాధారణంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్ర హోంమంత్రితో పెద్దగా పని ఉండదు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి సాధారణంగా ఎక్కువగా ఆర్థికశాఖ మంత్రితో పని ఉంటుంది. రాష్ట్రానికి వివిధ ప్రాజెక్టుల కింద అందాల్సిన నిధులు, కేటాయింపులపై విజ్ఞప్తి చేస్తుంటారు.

ఆ తర్వాత పనులను బట్టి జలవనరుల శాఖ మంత్రినో.. పెట్రోలియంశాఖ మంత్రినో.. ఇలా అవసరాన్ని బట్టి కేంద్రమంత్రులను ముఖ్యమంత్రులను కలుస్తుంటారు. ఇవేవీ కాదంటే ప్రధానితో సమావేశం అవుతుంటారు. కానీ సీఎం జగన్ మాత్రం ఎక్కువగా అమిత్‌షాతోనే భేటీ అవుతుంటారు. మరో విషయం ఏంటంటే.. సాధారణంగా సీఎం ఢిల్లీలో ఎవరిని కలిసినా.. బయట వేచి ఉండే మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుంటారు. ఈ విషయం మీద కలిశాం.. ఇలా అడిగాం.. ఇలా స్పందించారు.. అని ఏదో ఒకటి చెబుతుంటారు.

అయితే సీఎం జగన్ మాత్రం ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు ఎవరిని కలిసినా మీడియాతో మాట్లాడేందుకు ఏమాత్రం ఇష్టపడరు. వస్తారు.. వెళ్తారు..అంతే తప్ప.. ఎందుకు.. ఏమిటి.. ఏం జరిగింది.. ఏం చర్చించారు.. ఎలా స్పందించారు.. ఇలాంటి వివరాలు ఏమీ చెప్పరు.. ఆ తర్వాత మీడియాకు ఓ ప్రెస్‌నోటో వస్తుంది.. దాన్ని చూసి మీడియా వార్తలు రాసుకోవల‌సిందే. అయితే ఈ తాజా పర్యటనకు కాస్త ప్రాధాన్యం కూడా ఉంది. అసలు కరోనా టైమ్‌లో ఏ సీఎంలూ ఢిల్లీ పెద్దగా వెళ్లడం లేదు.

అంతా ఆన్‌లైన్‌లో భేటీలు కానిస్తున్నారు. అయితే.. సీబీఐ బెయిల్ రద్దు అంశం, రఘురామరాజురచ్చ కారణంగా జగన్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం వచ్చింది. కానీ పాపం... వైసీపీ మీడియా దీన్ని ఎలా కవర్ చేయలేక ఇబ్బందిపడుతోంది. జగన్ కు ఇబ్బంది లేకుండా.. పర్యటన రాష్ట్రం కోసమే అని చెప్పేందుకు తంటాలు పడుతోంది. ఎవరి కష్టాలు వాళ్లవి.


మరింత సమాచారం తెలుసుకోండి: