వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర మళ్లీ ప్రారంభం కాబోతోంది. ఈ పాదయాత్ర పునఃప్రారంభానికి వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నెల 28 నుంచి పాదయాత్ర కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని వైఎస్ షర్మిల కోరింది. ఫిబ్రవరి 2 నుంచి పాదయాత్ర కొనసాగించేందుకు 15 షరతులతో కూడిన అనుమతిని పోలీసులు ఇచ్చారు. పోలీస్ శాఖ ఇచ్చిన అనుమతి మేరకు ఫిబ్రవరి 2 నుంచే కొనసాగించాలని అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిర్ణయించారు.


పాదయాత్ర ఆగిన చోట నుంచి పాదయాత్ర మొదలు కానుంది.ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల, భూపాలపల్లి, ములుగు,నర్సంపేట నియోజక వర్గాలలో పాదయాత్ర పూర్తి అయ్యింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మిగిలిన 8 నియోజక వర్గంలో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగనుంది. వర్ధన్నపేట,వరంగల్ ఈస్ట్, వెస్ట్ స్టేషన్ ఘనపూర్, జనగాం, పాలకుర్తి, మహబూబాబాద్ మీదుగా పాలేరు నియోజక వర్గంలో మరోసారి అడుగు పెట్టేలా వైఎస్ షర్మిల  రూట్ మ్యాప్ సిద్ధం అవుతోంది.


వైఎస్ షర్మిల  ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇప్పటికే 3512 కి.మీ పూర్తి అయ్యింది. అయితే మొత్తం  4 వేల కి.మీ పూర్తి చేసేందుకు 25 రోజుల పాటు వైఎస్ షర్మిల  పాదయాత్ర సాగనుంది. ముగింపు సభ పాలేరు నియోజక వర్గంలో భారీఎత్తున నిర్వహించేందుకు వైటీపీ పార్టీ యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తుంది. దీనికి తోడు వైఎస్ షర్మిల పాలేరు నియోజక వర్గంపై ఫుల్ గా ఫోకస్ పెట్టనున్నారు. అక్కడి నుంచే పోటీ చేస్తానని వైఎస్ షర్మిల ఇప్పటికే కన్ఫామ్‌ చేసేశారు.


తాను పోటీ చేసే నియోజక వర్గంలో గెలవకపోతే.. ఇక ఆమెకు రాజకీయం భవిష్యత్‌ ఉండనట్టే.. ఇప్పటికే పవన్ కల్యాణ్, లోకేశ్ వంటి వారు మొదటి ఎన్నికల్లో ఓడిపోయి రాజకీయంగా బలహీనం అయ్యారు. తాను అలా కాకూడదని వైఎస్ షర్మిల భావిస్తున్నారు. అందుకే పాలేరుపై ఇప్పటి నుంచే ఫోకస్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: