వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ప్రస్తుతం అత్యంత కీలక సవాలు పార్టీ నాయకులను కాపాడుకోవడం, వారిని యాక్టివ్‌గా మార్చుకోవడమేనని పార్టీ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. 2024 ఎన్నికల ఓటమి తర్వాత అనేక నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు నిస్తేజంగా ఉన్నాయి. కొందరు నాయకులు పూర్తిగా పార్టీ కార్యక్రమాల నుంచి దూరం అయ్యారన్న వాదనలు జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఓడిపోయిన నియోజకవర్గాల్లో పరిస్థితి మరింత దారుణంగా మారిందనే అభిప్రాయం వెలువడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 175 నియోజకవర్గాల్లో 130 స్థానాలకు సంబంధించి సమగ్ర నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. ఇందులో ఏయే నియోజకవర్గాల్లో నాయకులు గ్రౌండ్ లెవెల్‌లో పనిచేస్తున్నారు, ఎవరెవరు పార్టీ సమావేశాలకు కూడా హాజరుకావడం లేదు, ఎవరు ?అధికార పార్టీతో సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు వంటి విషయాలన్నింటినీ జగన్ స్వయంగా సమీక్షిస్తున్నారని తెలుస్తోంది.


గత 17 నెలలుగా పార్టీ నిర్వహించిన కార్యక్రమాల్లో ఎంతమంది నాయకులు పాల్గొన్నారు ? శక్తివంతమైన బూత్ కమిటీలను నిర్మించడంలో ఎక్కడ లోపించారు వంటి అంశాలు కూడా విశ్లేషణలో భాగమయ్యాయి. పార్టీలో ఉంటూనే అధికారంలో ఉన్న వారితో కుమ్మక్కైన నాయకుల జాబితా కూడా జగన్ చేతుల్లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. వీరు పార్టీకి ఉపయోగం ఉండకపోవడంతో, కనీసం కొద్దిమంది నాయకులను మార్పులకు గురి చేసి మిగతావారికి బలమైన సందేశం ఇవ్వాలని వైసీపీ భావిస్తున్నట్లు సమాచారం. 130 నియోజకవర్గాల్లో అందరినీ మార్చడం సాధ్యం కాకపోవడంతో, కనీసం ఐదు నుంచి పది కీలక స్థానాల్లో సమన్వయకర్తలను మార్చే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.


ఈ నేపథ్యంలోనే కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్తను తాజాగా మార్చడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయనే పార్టీలో యాక్టివ్‌గా లేకపోవడం, పార్టీ తరఫున నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం ప్రధాన కారణాలుగా చెప్పబడుతోంది. ఇదే పరిస్థితి పలు జిల్లాల్లోనూ ఉన్నప్పటికీ, ప్రతిచోటా మార్పులు చేయడం ప్రాక్టికల్ కాదన్న భావన పార్టీ అధిష్ఠానంలో కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఉత్తరాంధ్రలో పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు కూడా పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా కనిపించకపోవడాన్ని జగన్ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది.


అందుకే అక్కడ కూడా మార్పుల వైపు అడుగులు వేయాలని పార్టీ ఆలోచిస్తున్నది. ఈ నెలాఖరుకే ఇందులో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మార్పులు నేతలకు షాక్‌ ఇచ్చి వారిని యాక్టివ్‌గా మారుస్తాయా ? లేకపోతే వారు అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూనే కొనసాగుతారా ? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: