సంగీత కళానిధి అవార్డు.. మద్రాసు మ్యూజిక్ అకాడమీ ఎన్నో దశాబ్దాలుగా ఏటా ఇస్తూ వస్తున్న ఈ పురస్కారం ఈ సారి వివాదాస్పదమైంది.  కర్ణాటక సంగీత కళాకారులు, అభిమానుల మధ్య చర్చకు.. ఇంకా చెప్పాలంటే సంఘర్షణకు దారి తీసింది. ఈ సారి ఆ పురస్కారాన్ని  ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తోడూర్ మాడభూసి కృష్ణకు ప్రకటించడమే వివాదానికి కారణం అయింది.


ఈ ఏడాది డిసెంబరు లో మార్గళి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అకాడమీ వార్షికోత్సవాల్లో ఈయనకు ఈ పురస్కారం అందజేయనున్నట్లు మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వెల్లడించింది. కానీ పలువురు కర్ణాటక సంగీత విద్వాంసులు, సంగీతాభిమానులు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అవార్డును కృష్ణకు ఇవ్వడాన్ని నిరసిస్తూ త్రిచూర్ బ్రదర్స్ కృష్ణమోహన్, రామ్ కుమార్, మోహన్ లు తాము ఈ మార్గళి ఉత్సవాల్లో పాల్గొనమని తేల్చి చెప్పారు. ప్రముఖ కర్ణాటక సంగీత విదూషీమణులైన కల్పన, గాయత్రి సిస్టర్స్ కూడా అదే తరహా బహిరంగ ప్రకటన చేశారు.


చిత్రవీణ రవికిరణ్ తనకు 2017లో  అకాడమీ ఇచ్చిన సంగీత కళానిధి అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంకా సంగీతాభిమానులైన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వీరికి మద్దతుగా గళం కలిపారు. అదే సమయంలో అటు టీఎం కృష్ణ కు పలువురు బాసటగా నిలుస్తున్నారు.


టీఎం కృష్ణ కర్ణాటక సంగీత రంగంలో కుల దుభిమానానికి వ్యతిరేకంగా చాలా కాలంగా పోరాడుతున్న సామాజిక కార్యకర్త. ఎన్నో పుస్తకాలు రాశారు. రామన్ మెగసెసే పురస్కారాన్ని సైతం అందుకున్నారు. అయితే త్యాగరాజు స్వామి వారి కృతులు కొన్నింటిలో కుల వివక్ష, లింగ వివక్ష ఉన్నాయని.. ఆయన కృతుల్లో కొన్ని ఇప్పటి కాలానికి అనుగుణంగా లేవని ఆయన చేసిన వ్యాఖ్యలు కర్ణాటక సంగీత వర్గాల్లో ఆగ్రహానికి కారణం అయ్యాయి. దీంతో పాటు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పై కూడా ఆమె తన దేవదాసీ మూలాల నుంచి దూరం జరిగి ఆదర్శ బ్రాహ్మణ మహిళగా మారిపోయారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక సంగీతం హిందూ దేవుళ్లను కీర్తించడానికే కాదని.. ఇకపై తాను నెలనెలా జీసస్, అల్లాను కీర్తిస్తూ సంగీత కృతులను విడుదల చేస్తానని ప్రకటించడంపై కూడా వివాదం చెలరేగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: