ముందుగా తెలుగు చిత్రసీమకు హీరోయిన్ గా ఛలో మూవీ తో రంగప్రవేశం చేసింది రష్మిక మందన్న. అంతకుముందు కన్నడలో కిరిక్ పార్టీ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక, ఆ సినిమాతో అక్కడ పెద్ద విజయం అందుకుంది. అయితే ఆ సినిమా సక్సెస్ ని అనంతరం ఛలో మూవీలో ఆమెను హీరోయిన్ గా ఎంపిక చేసాడు వెంకీ కుడుముల. నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ఆ సినిమా మంచి సక్సెస్ ను అందుకొని తెలుగులో కూడా రష్మిక కు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ఆమె నటించిన గీత గోవిందం సినిమా అతిపెద్ద విజయాన్ని అందుకొని ప్రేక్షకులతో పాటు ముఖ్యంగా యువతలో రష్మిక కు బాగా క్రేజ్ తీసుకొచ్చింది.  

దాని అనంతరం దేవదాసు, డియర్ కామ్రేడ్ సినిమాలతో ఓ మోస్తరు విజయాలను అందుకున్న రష్మిక, ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు అలానే నితిన్ హీరోగా తెరకెక్కిన భీష్మ సినిమా సక్సెస్ లతో విపరీతమైన క్రేజ్ ని సంపాదించింది. ప్రస్తుతం తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాతో పాటు కన్నడలో పొగరు, తమిళంలో సుల్తాన్ సినిమాలు చేస్తున్న రష్మికనే తన సినిమాలో హీరోయిన్ గా కావాలంటూ ఇటీవల కోలీవుడ్ హీరో ఒకరు మంకుపట్టు పడుతున్నారు అనేది లేటెస్ట్ కోలీవుడ్ వర్గాల టాక్. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక యూత్ ఫుల్ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న సదరు హీరో, తదుపరి చేయబోయే సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని, కాగా ఆ పాత్రకు రష్మిక అయితేనే బాగుటుందని నిర్మాత, దర్శకులతో చెప్పాడట.  

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె డేట్స్ దొరకడం కొంత కష్టం అని వారు చెప్పినప్పటికీ, ఆ పాత్రని ఎట్టిపరిస్థితుల్లో ఆమె చేతనే చేయించాలని గట్టిగా మంకుపట్టు పట్టుకు కూర్చున్నాడట. మరి ఆమె డేట్స్ వారికి లభిస్తాయా లేదా అనే విషయం అటుంచితే, ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ లో కూడా మంచి పేరు దక్కించుకోవడంతో పాటు యువతలో ఎంతో ఆదరణ కలిగిన రష్మిక క్రేజ్ కి ఇది నిదర్శనం అని అంటున్నారు విశ్లేషకులు. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త నిజమో కాదో తెలియదుగాని, ఈ విషయమై పలువురు కోలీవుడ్ ప్రేక్షకులు మాత్రం తెగ చర్చించుకుంటున్నారట....!!

మరింత సమాచారం తెలుసుకోండి: