టాలీవుడ్‌లో ‘వీరభద్ర’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ తనుశ్రీ దత్తా కెరీర్‌కి ఆ సినిమా ఏ మాత్రం ఉపయోగపడలేదు. ఎందుకంటే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. దాంతో వెంటనే బాలీవుడ్‌లోకి తిరిగి వెళ్ళిపోయి అక్కడ వరుస సినిమాలు చేసుకుంటూ మంచి ఫేమ్ సంపాదించుకుంది. తన గ్లామర్‌తో పాటు తన యాక్టింగ్‌తోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ, ఇటీవల కొన్ని వ్యక్తిగత సమస్యలతో వార్తల్లో నిలిచింది. ఇటీవలే ఒక వీడియోలో తాను ఇంట్లోవారి చేతుల మీదుగా వేధింపులకు గురవుతున్నానని, టార్చర్ తట్టుకోలేకపోతున్నానని బయటపెట్టిన తనుశ్రీ, సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
 

అలాంటి ఈ భామ తాజాగా ‘బిగ్ బాస్’ రియాలిటీ షోపై చేసిన కామెంట్స్ మరింత సంచలనంగా మారాయి. ఒక ఇంటర్వ్యూలో తనుశ్రీని బిగ్ బాస్‌లో పాల్గొనే అవకాశంపై ప్రశ్నించగా, ఆమె ఓపెన్‌గా స్పందించింది. “ప్రతి ఏడాది బిగ్ బాస్ నుంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఈసారి నాకు ఏకంగా రూ. 1.65 కోట్లు ఆఫర్ చేశారు. అంతకంటే ఎక్కువ ఇస్తామన్నారు కూడా. కానీ నేను రిజెక్ట్ చేశాను. కారణం ఏంటంటే నాకు బిగ్ బాస్ షో ఫార్మాట్ అస్సలు నచ్చదు” అని చెప్పింది. తనుశ్రీ మరింత క్లియర్‌గా మాట్లాడుతూ – “ఆ షోలో పురుషులు, మహిళలు ఒకే బెడ్‌ షేర్ చేసుకోవాలి. అక్కడే గొడవలు పడతారు. ఆ ఫార్మాట్ నాకు అసహ్యం.

 

అంతే కాకుండా నేను ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. కేవలం ఒక రియాలిటీ షో కోసం ఒకే బెడ్‌పై మరో వ్యక్తితో పడుకోవడం నాకు సాధ్యం కాదు. నేను అంత చీప్ కాదు. వాళ్లు ఎంత డబ్బు ఇచ్చినా కూడా నేను బిగ్ బాస్‌కి ఎప్పటికీ వెళ్లను” అంటూ నేరుగా ఫైర్ అయ్యింది. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమెను సపోర్ట్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఇలా ఓపెన్‌గా కామెంట్స్ చేయడం సరైన పద్ధతి కాదని అంటున్నారు. ఏదేమైనా తనుశ్రీ దత్తా మాటలతో మళ్లీ బిగ్ బాస్ షోపై కొత్త చర్చ మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: