టాలీవుడ్ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన తన భార్య, ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద మంగళసూత్రం ధరించడంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “ది గర్ల్‌ఫ్రెండ్” ప్రస్తుతం రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తుండగా, యువ హీరో దీక్షిత్ శెట్టి కథానాయకుడిగా కనిపించనున్నాడు. నవంబర్ 7న ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా టీమ్ వరుసగా ప్రమోషన్ ఈవెంట్లలో పాల్గొంటూ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.ప్రచార కార్యక్రమాల మధ్య రాహుల్ రవీంద్రన్ ఒక ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. అదే మంగళసూత్రం (తాళి) గురించి. ఈ విషయంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 

రాహుల్ మాట్లాడుతూ..“పెళ్లి తర్వాత మహిళలు తప్పనిసరిగా మంగళసూత్రం ధరించాలనే ఆలోచనను నేను పూర్తిగా సమర్థించను. అది పూర్తిగా నా భార్య చిన్మయి నిర్ణయం. తాళి వేసుకోవాలా వద్దా అనేది ఆమె ఇష్టం. నేను ఎప్పుడూ ‘తాళి వేసుకోవద్దు’ అని చెప్పుతుంటాను. ఎందుకంటే పెళ్లి తర్వాత ఒక మహిళ తన మెడలో మంగళసూత్రం ధరించడం ద్వారా వివాహిత అని ప్రపంచానికి తెలియజేయాలి — కానీ అదే సమయంలో ఒక పురుషుడు పెళ్లి అయినట్టు తెలియజేసే ఎలాంటి గుర్తు ధరిస్తాడా? లేదు కదా. ఇది లింగ వివక్ష లాంటిదే. సమాన హక్కులు ఉండాలంటే ఇలాంటి పాత ఆచారాలను కూడా ప్రశ్నించాలి” అని రాహుల్ స్పష్టం చేశారు.



రాహుల్ రవీంద్రన్ మాటలు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వచ్చింది. కొందరు నెటిజన్లు ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తూ, “ఇది చాలా ఆలోచింపజేసే విషయం, సమాజంలో మహిళలపై ఉన్న సంప్రదాయ ఒత్తిళ్లను ప్రశ్నించడం చాలా అవసరం” అని అభినందిస్తున్నారు. మరోవైపు, కొందరు మాత్రం ఆయన మాటలతో ఏకీభవించకుండా, “ఇది మన సంస్కృతిలో భాగం, మంగళసూత్రం పవిత్ర బంధానికి సంకేతం” అంటూ విమర్శిస్తున్నారు. మొత్తానికి, ఒక సినిమా ప్రమోషన్ సందర్భంగా చేసిన రాహుల్ వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక చర్చకు దారితీశాయి. మంగళసూత్రం కేవలం ఒక ఆచారం కాదా, లేక అది స్త్రీకి మాత్రమే వర్తించే సంప్రదాయమా అనే ప్రశ్నను ఆయన మరోసారి ముందుకు తెచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: