ఈ మద్య వరుసగా బయోపిక్ చిత్రాలు వస్తున్న విషయం తెలిసిదే. సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన, ఏదైనా విశిష్టమై పరిశోదనా రంగంలో ఉన్నవారి జీవితాలపై బయోపిక్ చిత్రాలు వస్తున్నాయి. తెలుగులో ఇప్పటికే మహానటి, ఎన్టీఆర్ బయోపిక్ నుంచి మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇటీవల వైఎస్సార్ జీవిత కథ ఆధారంగా తీసిన యాత్ర చిత్రం రిలీజ్ అయ్యింది. ఇక బాలీవుడ్ లో సంజు, ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్, థాక్రే సినిమాలు రిలీజ్ అయ్యాయి.
బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, అక్షయ్ ఖన్నా నటించిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ మూవీపై మొదటి నుంచి కాంట్రవర్సీలు వస్తూనే ఉన్నాయి. తాజాగా అనుపమ్ ఖేర్, అక్షయ్ ఖన్నా సహా మరో 12 మందిపై ముజఫర్పూర్ జిల్లా కంటి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రముఖ రచయిత సంజయ్ బారు రచించిన ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాపై సుధీర్ కుమార్ ఓజా అనే న్యాయవాది సబ అలం సబ్-డివిజినల్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టుకు ఫిర్యాదు చేశారు.
ఈ సినిమాలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలు కీలక నేతలను కించపరిచేలా చిత్రీకరించినందును అందుకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సుధీర్ కుమార్ ఓజా తన పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. అయితే సుధీర్ కుమార్ ఓజా పిటిషన్ని విచారణకు స్వీకరించిన కోర్టు.. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్ మూవీ యూనిట్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపించాల్సిందిగా పోలీసులను ఆదేశిస్తూ జనవరి 8వ తేదీన ఆదేశాలు జారిచేసింది.
కానీ ఇప్పటి వరకు కోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టారు పోలీసులు. దాంతో సుధీర్ కుమార్ ఓజా మరోసారి కోర్టును ఆశ్రయించారు. తమ ఆదేశాలను అమలుపరిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈసారి ముజఫర్పూర్ జిల్లా సీనియర్ ఎస్పీని కోర్టు ఆదేశించింది. మొత్తానికి కోర్టు ఆదేశాలతో అప్రమత్తమైన జిల్లా ఎస్ఎస్పీ.. అనుపమ్ ఖేర్, అక్షయ్ ఖన్నా సహా మరో 12 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కంటి పోలీసులను ఆదేశించింది.