అగ్రరాజ్యం అమెరికాలో కలకలం చోటుచేసుకుంది. స్వప్రయోజనాల కోసం హెచ్1బీ వీసాలను మోసపూరితంగా ఉపయోగించుకున్నారన్న అభియోగంపై అమెరికాలో నలుగురు భారతీయులను అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు తెలుగు వాళ్లు కూడా ఉన్నారు. న్యూజెర్సీలో నివాసముంటున్న విజయ్ మానె, వెంకటరమణ మన్నం, సతీశ్ వేమూరి, ఫెర్డినాండో శిల్వాను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పూచీకత్తుపై విడుదల చేశారు. ప్రొక్యూర్ ప్రొఫెషనల్స్, క్రిప్టో ఐటీ సొల్యూషన్స్ పేరుతో ఉద్యోగులను అందించే సంస్థలను ఈ నలుగురూ గతంలో నడిపేవారు.
అమెరికా కంపెనీలు ప్రత్యేక వృత్తుల్లో నిపుణులైన విదేశీ సిబ్బంది నియామకానికి హెచ్1బీ వీసా వీలు కల్పిస్తుంది. ఏటా 65వేల వీసాలను మాత్రమే మంజూరు చేస్తుంటారు. ఈ వీసాలకు ప్రపంచ దేశాల్లో విపరీత డిమాండ్ ఉంది. ముఖ్యంగా భారత్, చైనాల నిపుణులు ఈ వీసాలతో అధికంగా లాభపడుతున్నారు. దీంతో ఏటా వేలాది మంది అమెరికాకు వలస వెళ్తున్నారు. ట్రంప్ ప్రభుత్వ విధానాలతో కొన్నాళ్లుగా దరఖాస్తుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. యూఎస్సీఐఎస్ మొదటి 20వేల దరఖాస్తుల్లో యూ ఎస్ మాస్టర్ డిగ్రీ లేదా అంతకన్నా ఎక్కువ అర్హత ఉన్నవారికి వీసాల వార్షిక పరిమితి నుంచి మినహాయింపు ఉంటుంది.
కాగా, నైపుణ్యాల పరంగా టాప్లో ఉన్న మనోళ్లు వీసాల విషయంలోనూ ప్రత్యేకతను సాధించుకున్నారు. 2016లో అమెరికా ప్రభుత్వం జారీచేసిన మొత్తం హెచ్-1బీ వీసాల్లో 74.2 శాతం వీసాలు భారతీయ ఐటీ నిపుణులే దక్కించుకున్నారు. 2017లో ఈ సంఖ్య మరింత పెరిగి 75.6 శాతానికి చేరుకుంది. మరోవైపు చైనా 2016, 2017 సంవత్సరాల్లో వరుసగా 9.3, 9.4 శాతం వీసాలు మాత్రమే దక్కించుకుని భారత్ తర్వాత సుదూరాన నిలిచినప్పటికీ రెండోస్థానాన్ని దక్కించుకుంది. ఈ వివరాలను అమెరికా పౌరసత్వ, వలససేవల సంస్థ (యూఎస్సీఐఎస్) నివేదిక వెల్లడించింది.ఇదిలాఉండగా...కొత్తగా జారీచేసే ప్రాథమిక హెచ్-1బీ వీసాల్లో భారతీయ లబ్ధిదారుల సంఖ్య కొద్దిగా పడిపోయింది. 2017లో కొత్త హెచ్-1బీ వీసాలు పొందిన వారి సంఖ్య 4.1 శాతం మేర పడిపోగా.. పునరుద్ధరణ హెచ్-1బీ వీసాలు పొందినవారి సంఖ్య 12.5 శాతం పెరిగింది.