పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుల జీవితాలు చీకటితో నిండిపోవడంతో చాలామంది విచారం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే వేలాది మంది ఉపాధ్యాయులు చనిపోయారు. ఇన్నేళ్లు పాఠశాలలకు వెన్నుముకలా నిలిచిన ఉపాధ్యాయులను ఆదుకోవాల్సిన యాజమాన్యాలు మొహం చాటేశారు. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేశారు కానీ టీచర్లకు మాత్రం డబ్బులు ఇవ్వడానికి ఈ ప్రైవేటు యాజమాన్యాలకు మనసు రాలేదు. ఈ కరోనా సంక్షోభంలో వారి జీవితాల్లో దాపురించిన దుస్థితి వర్ణనాతీతం.
నిజానికి చాలా మంది ప్రైవేట్ ఉపాధ్యాయులు తమ అభిరుచికి తగ్గట్టుగా అరకొర జీతానికే పాఠాలు బోధిస్తుంటారు. వారి పరిస్థితి రెక్కాడితే గానీ డొక్కాడదు అనే ధోరణి లో ఉంటుంది. ఇక కనిపించని పెనుభూతం కరోనా కల్లోలంతో వారి జీవితాలు బజారున పడ్డాయి. పీహెచ్డీ చేసిన లెక్చరర్లు సైతం పొలంలో పనులు చేసారంటే.. కరోనా ఉపాధ్యాయులపై ఎంతటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే, ఈరోజు టీచర్స్ డే అయినప్పటికీ.. ఉపాధ్యాయుల సంతోషంగా జరుపుకోవడానికి తమ జీవితాలు ఇంకా చక్కబడలేదని చెప్పుకోవచ్చు.