వైసీపీలో సీనియర్ నేతలు ఏం చేయలేక పోతున్నారా..? తమకున్న అసంతృప్తిని అప్పుడప్పుడు బయట పెట్టడమే తప్ప పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేక పోతున్నారు..?అంటే అవుననే అంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది. కానీ జగన్ మాత్రం సీనియర్లను పట్టించుకోవడం లేదు. దీంతో వారిలో అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉంది. కానీ వారు ప్రత్యేకించి ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. మరో నాలుగేళ్లు అధికారంలో ఉండడంతో వారు మౌనంగానే సమయం కోసం వేచి చూస్తున్నట్లు కనబడుతుంది. శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు సీనియర్ నేత, దాదాపు ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర ఆయన మంత్రిగా పనిచేశారు.

మంచి మాటకారి, విపక్షాలకు సైతం దీటుగా జవాబివ్వ గల   నేర్పరి. అలాంటి ధర్మాన ప్రసాదరావును జగన్ పట్టించుకోవడం లేదు . తన కంటే జూనియర్లు కేబినెట్లోకి చేరడంతో ధర్మాన ప్రసాదరావు మరింత రగిలిపోతున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు పై తన అసంతృప్తిని బయటపెట్టిన ధర్మాన ప్రసాదరావు తర్వాత మౌనంగానే ఉండిపోయారు. ఇల్లు వదిలి బయటకు రావడం లేదు. దీనికి ప్రధాన కారణం జిల్లాలో తొలిసారి గెలిచిన అప్పలరాజు మంత్రి పదవిని చేపట్టారు. తన సోదరుడికి ప్రమోషన్ ఇచ్చి ఉపముఖ్యమంత్రిని చేసినా తనకు అన్యాయం జరిగిందని ధర్మాన ప్రసాదరావు భావిస్తున్నారు.

ఆయన అందుకే అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కూడా  ఆయన పెదవి విప్పడం లేదు. తన అక్కసునంతా మౌనం ద్వారానే ధర్మాన ప్రసాదరావు జగన్ కు తెలియజేస్తున్నారు. ఇక మరో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఇంతే. ఆయన గత కొద్ది రోజులుగా బయటకు రావడం లేదు. నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఈయన కూడా అసంతృప్తితోనే ఉన్నారు. ఒకటి రెండు సార్లు తన అసంతృప్తిని తెలియజేసిన షోకాజ్  నోటీస్ వరకు వెళ్లడంతో ఆయన మౌనమే మంచిదని భావిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ వరకు వెయిట్ చేయాలన్నది వీరిద్దరి ఆలోచన.

మరింత సమాచారం తెలుసుకోండి: