వైసీపీ ఫైర్బ్రాండ్ ఎమ్మెల్యే తెలుగు నేలపై దశాబ్దంన్నరగా రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీలో ఆమెకు లక్ కలిసి రాలేదు. వైసీపీలోకి జంప్ చేసిన ఆమె చిత్తూరు జిల్లా నగరి నుంచి పోటీ చేసి సీనియర్ రాజకీయవేత్త అయిన గాలి ముద్దుకృష్ణమనాయుడిని ఓడించి అసెంబ్లీలోకి అడుగుపెట్టి పెద్ద సంచలనమే క్రియేట్ చేశారు. సంచలన డైలాగ్స్కు కేరాఫ్ అయిన రోజా కొద్ది రోజులుగా ఏం మాట్లాడినా అది పెద్ద కాంట్రవర్సీయే అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన సర్వేలో సైతం వచ్చే ఎన్నికల్లో రోజా తీరు మార్చుకోకపోతే పక్కన పెట్టేయాలని చెప్పారట.
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆమెను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్న టీడీపీ నాయకులు నగరిలో ఆమెపై ధీటైన ప్రత్యర్థిని నిలబెట్టాలని కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో రోజాపై స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన గాలి ముద్దుకృష్ణమనాయుడు తర్వాత ఎమ్మెల్సీ అయినా ఆయన అనారోగ్యం రీత్యా చురుగ్గా నియోజకవర్గంలో తిరగలేకపోతున్నారు. ఆయన తనయుడు పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నా చంద్రబాబు మాత్రం సినీగ్లామర్తో ఉన్న రోజాపై మరో సినీ హీరోయిన్నే రంగంలోకి దించే ప్లాన్ చేస్తున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే రోజా తరంలో తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదిగిన సీనియర్ నటి వాణీ విశ్వనాథ్ను టీడీపీ నాయకులు పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇక వాణీ కూడా తాను చంద్రబాబు ఆదేశిస్తే నగరిలో రోజాపై పోటీ చేస్తానని చెప్పారు. దీనిని బట్టి టీడీపీ అధిష్టానం నగరిలో రోజాపై సినీ గ్లామర్నే పోటీ పెడుతున్నట్టు సంకేతాలు ఇచ్చేసింది. రోజా గత ఎన్నికల్లో ముద్దుకృష్ణమ నాయుడిని ఓడించేందుకు కొంత వరకు ఆమె సినీగ్లామర్ కూడా హెల్ఫ్ అయ్యింది. ఇప్పుడు టీడీపీ అధిష్టానం కూడా రోజాను అదే సినీగ్లామర్తో ఎటాక్ చేయిస్తుండడంతో రోజా వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు తన వ్యూహాన్ని అమలు చేసే ప్రక్రియ స్టార్ట్ చేసేశారు.
ఇప్పటి వరకూ రోజా హైదరాబాద్ లోనే నివాసముంటున్నారు. నగరికి వచ్చినప్పుడు ఆమె అద్దె ఇంట్లోనే ఉంటూ వస్తున్నారు. అద్దె ఇంట్లో ఉండటం కంటే లోకల్గా సొంత ఇళ్లు ఉంటేనే ప్రజల్లో తాను స్థానికురాలినన్న భావన బలంగా ఉంటుందని భావించిన ఆమె ఇక్కడ సొంత ఇళ్లు నిర్మాణ పనులు ప్రారంభించారు. రోజా ప్రస్తుతం ఎక్కువుగా నగరిలోనే ఉంటూ అన్ని కార్యక్రమాల్లోను పాల్గొంటున్నారు. ఇక మూడు నెలల పాటు కంటిన్యూగా ఉండే వైఎస్సార్ కుటుంబంలో పాల్గొని నియోజకవర్గం మొత్తం చుట్టి వచ్చేందుకు పక్కా ప్లానింగ్తో ఉన్నారు.
ప్రస్తుతం ఆమె మీడియా ముందుకు రావడం మానేశారు. వచ్చే ఎన్నికలకు పెద్దగా టైం లేకపోవడంతో ఆమె నగరికే పరిమితమయ్యేలా ప్రణాళిక వేసుకున్నారని తెలుస్తోంది. నగరిలోనే తరచూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. రోజా హడావిడి చూస్తోన్న వారు మాత్రం వచ్చే ఎన్నికల్లో తమ పార్టీయే గెలుస్తుందని, తాను ఎమ్మెల్యేగా గెలిస్తే మహిళా కోటాలో మంత్రి అవుతానని భావిస్తోందని.... ఈ క్రమంలోనే ముందు తన ఇళ్లు చక్కదిద్దుకునే పనిలో ఉన్నారని, ఇక్కడ టీడీపీ వాణీ విశ్వనాథ్ను తనపై పోటీకి దింపినా ఆమె గెలిచేందుకు ఈ వ్యూహాలు అమలు చేస్తున్నారని గుసగుసలాడుకుంటున్నారు.