తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైసీపీపై పోరాటానికి కొత్త పంథా ఎంచుకుంది. వైసీపీ నేతలు అరాచకాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తూ అందుకు నిదర్శనంగా వైకాపా బాధిత శిబిరాలు ఏర్పాటు చేస్తోంది. గుంటూరులో ఆరండల్ పేటలో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. వైకాపా బాధిత కుటుంబాలకు పది వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తారట. అలాగే తప్పుడు కేసులు ఎదుర్కొనేందుకు మంచి లాయర్లను కూడా పెడతారట.
చంద్రబాబు ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరాలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రతి విషయంలోనూ నీచ రాజకీయాలు చేస్తున్నారని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఐదేళ్ల పాలనపై టీడీపీ బాధితుల శిబిరం ఏర్పాటు చేస్తే కరకట్ట నిండిపోతుందని కామెంట్ చేశారు. అంతే కాదు.. చంద్రబాబుకు సవాల్ కూడా విసురుతున్నారు. బాబుకు నచ్చిన పది గ్రామాలు ఎంచుకోండి. ఆ గ్రామాల్లో టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీ చేసిన అరాచకాలపై మాట్లాడుదాం. మీకు ఆ ధైర్యం ఉంటే చాలెంజ్ స్వీకరించాలని సవాల్ చేసారు.
చంద్రబాబు హయాంలో ఏ నుంచి జెడ్ వరకు అన్ని అక్షరాలతో ట్యాక్స్లు వసూలు చేశారు. టీడీపీ నేతలు లక్షల కోట్లు దోచుకున్నారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే చాలెంజ్ స్వీకరించాలి.సీఎం వైయస్ జగన్ పారదర్శక పాలన అందిస్తున్నారు. చంద్రబాబులా పోలీసులకు పచ్చ చొక్కాలు తొడగలేదు. గత ఐదేళ్ల పాలనలో పోలీసులను చంద్రబాబు టీడీపీ కార్యకర్తలుగా వాడుకున్నారు. గ్యాంగ్స్టర్స్, ఫ్యాక్షనిస్టులు అంతా టీడీపీలోనే ఉన్నారు.. అంటూ మండిపడ్డారు శ్రీకాంత్ రెడ్డి.
ఇంకా శ్రీకాంత్ రెడ్డి ఏమంటున్నారంటే.. నీచ రాజకీయాల కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి బాబాయి వైయస్ వివేకానందరెడ్డిని చంద్రబాబు చంపించారు. గతంలో వంగవీటి రంగాను చంద్రబాబు ఏ విధంగా హత్య చేశాడో హరిరామ జోగయ్య చెప్పారు. ఒక విలేకరుని ఏ విధంగా చంపించావో రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయనివ్వకుండా చంద్రబాబు చేస్తున్న కుట్రలన్నీ ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. చంద్రబాబు, లోకేష్ దోపిడీలన్నీ ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి అన్నారు శ్రీకాంత్ రెడ్డి.