ఏపీ పోలిటికల్ స్క్రీన్పైకి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఫ్యామిలీ మేటర్ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. హఠాత్తుగా సుప్రసిద్ధ సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్గా, కీలకమైన మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(మాన్సాస్) ట్రస్ట్ చైర్పర్సన్గా అశోక్ గజపతి రాజు సోదరుడు ఆనంద గజపతిరాజు తనయురాలు సంచయిత గజపతిరాజును నియమించడం అనేక వివాదాలకు నెలవుగా మారింది.
ఎన్నో ఏళ్ల నుంచి సింహాచటం ఆలయానికి ధర్మకర్తగా వ్యవహరిస్తున్న అశోక్ గజపతిరాజుని తప్పించి, వైసీపీ సర్కారు సంచయితని నియమించడం సరికాదని వాదనలు వినిపిస్తున్నాయి. ఓ వైపు ఇలా వివాదం నడుస్తుండగానే తాజాగా కీలకమైన మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా సంచయిత నియమిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వులివ్వడం సంచలనం సృష్టించింది. వైసీపీ ప్రభుత్వం సడన్గా ఇలా చేయడంపై ఇటు టీడీపీ, అటు బీజేపీ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఆ ట్రస్ట్ల పేరుతో ఉన్న వేల ఆస్తులని లాగేసుకోవడానికి ఇలా చేసిందని ఫైర్ అవుతున్నాయి.
అయిన ఆనందగజపతి రాజు తన మొదటి భార్య ఉమాతో విడాకులు అయిపోయాయని, వారి ఫ్యామిలీ విజయనగరంలో ఉండటం లేదని, అలాంటిది వారిద్దరికి పుట్టిన సంచయితకు పదవులు ఎలా ఇస్తారని వాదిస్తున్నారు. ఇక ఈ విషయంపై న్యాయ పోరాటం చేసేందుకు టీడీపీకి సిద్ధమవుతుంటే, తమ పార్టీకి చెందిన సంచయితపై వేటు వేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. అసలు ఏపీ బీజేపీ నేతలు సంచయితపై ఫైర్ అవుతున్నారు.
అశోక్ గజపతిరాజుకు సపోర్ట్ ఇస్తూ....ఆ పదవులు చేపట్టడానికి సంచయితకు ఏం అర్హత ఉందని ప్రశ్నిస్తున్నారు. సంచయిత ఎన్నిసార్లు సింహాచలంకు వెళ్లిందని, అర్ధరాత్రులు జీవోలు తెచ్చి వైసీపీ ప్రభుత్వం ఆమెని చైర్పర్సన్గా నియమిస్తారని అంటున్నారు. అదే సమయంలో పార్టీ నేతలకు ఒక్క మాట చెప్పకుండా వైసీపీ ప్రభుత్వం చెప్పినట్లు విన్న సంచయితని బీజేపీ నుంచి బహిష్కరించాలని, పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి వెంటనే తొలగించాలని ఏపీ బీజేపీ నేతలు కేంద్రానికి లేఖరాసినట్లు తెలుస్తోంది.
అయితే బీజేపీ వేటు వేయకముందే సంచయిత వైసీపీలో చేరే అవకాశముందని మరోవైపు ప్రచారం జరుగుతుంది. ఎలాగో ప్రభుత్వం పదవులు ఇచ్చింది కాబట్టి, ఆమె వైసీపీలోకి వెళ్లిపోయే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.