ఇప్పటికే మహారాష్ట్ర లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఎన్నో గ్రామాలు జల దిగ్బంధం లోకి వెళ్ళిపోయి తీవ్ర అవస్థలు పడుతున్నాయి. ఎటు చూసిన నీరే ఉండడంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోయారు ఎన్నో గ్రామాల ప్రజలు. అయితే అటు అధికారులు వరద బాధితులకు ముమ్మర సహాయక చర్యలు చేపడుతున్నప్పటికి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో రోజు రోజుకి వరద ప్రభావం పెరిగిపోతుంది తప్ప ఎక్కడా తగ్గిన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో భారీ వర్షాల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు.
అటు వరద బాధితులను ఆదుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు కూడా చేపడుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడం పై స్పందించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్... ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసి ఎన్నో ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్న నేపథ్యంలో వరద బాధితులను ఆదుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు తీసుకోవడం తప్ప వేరే మార్గం లేదు అంటూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రం చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సంక్షోభం ఎదుర్కొంటుంది అంటూ తెలిపిన ఆయన... ఈ సమయంలో వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది అని ఆశిస్తున్నాము అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.