సీఎం కేసీఆర్ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. రెండో రోజు పౌరవిమానయాన శాఖ మంత్రితో పాటు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ప్రధానితో 50నిమిషాల పాటు కేసీఆర్ భేటీ జరిగింది. రాష్ట్రానికి చెందిన అనేక అంశాలపై చర్చించారు. మొత్తం 22అంశాలకు సంబంధించి లేఖలు అందించారు.
పునర్విభజన బిల్లు ప్రకారం తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏటా 450కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది. గత ఐదేళ్లల్లో నాలుగు సార్లు విడుదల అయినప్పటికీ ఒక ఏడాదికి సంబంధించిన నిధులు ఇంకా విడుదల కాలేదు. వాటిని విడుదల చేయాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఐఎమ్ఎమ్, ఐఎస్ఎస్ సంస్థలను నెలకొల్పాలని కోరారు. హైదరాబాద్ లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏర్పాటుతో పాటు మరో 23నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. నీతి అయోగ్ సిఫార్సులకు అనుగుణంగా మిషన్ కాకతీయ పథకానికి రూ.5వేల కోట్లు, మిషన్ భగీరథకు రూ.19,205కోట్లు విడుదల చేయాలని కోరారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్, జహీరా బాద్ నిమ్స్ కు నిధుల విడుదల, కరీంనగర్ లో త్రిపుల్ ఐటీ ఏర్పాటు, ఇండస్ట్రీయల్ కారిడార్ ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు.
అంతకుముందు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో సమావేశమైన కేసీఆర్ రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఆరు డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ లు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వసంతనగర్, ఆదిలాబాద్, జక్రాన్ పల్లి, దేవరకద్ర, కొత్తగూడెంలలో విమానాశ్రయాల ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్టుగా మంత్రికి తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి