ప్రకాశం జిల్లాలో వైసీపీ- జనసేన మధ్య సవాళ్ల యుద్ధం ముదురుతోంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తిట్టాడన్న అవమానంతో ఓ జనసేన కార్యకర్త ఆత్మహత్యే చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. అన్నా రాంబాబుపై విమర్శల వర్షం కురిపించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలవకుండా చేస్తానని సవాల్ విసిరారు.

పవన్ కల్యాణ్ సవాల్‌ నేపథ్యంలో వైసీపీ నుంచి కూడా సవాళ్లు వస్తున్నాయి. దీనిపై దీటుగా స్పందించిన అన్నా రాంబాబు.. గిద్దలూరులో పోటీ చేద్దామంటూ పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు. ఆ తర్వాత వైసీపీ నేతలు మళ్లీ రెచ్చిపోయి సవాళ్లు చేస్తున్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు సవాలును స్వీకరించే సత్తా జనసేనకు ఉందా ? అంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ప్రశ్నించారు. ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నా రాంబాబుపై విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌ట్ల ఆదివారం ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప‌వ‌న్‌కు స‌వాలు విసిరిన విష‌యం విధిత‌మే.  

ఇంతకీ అన్నా రాంబాబు ఏమన్నారంటే.. “ పోలీసు వ్యవస్థ మీద జనసేనకు నమ్మకం లేదు... నిజాయితీగా మీకు ఇష్టమొచ్చిన సంస్థలతో ఎంక్వైరీ చేయండి. నాకు, మా పార్టీ నాయకులకు వెంగయ్య మృతితో సంబంధం ఉందంటే న్యాయస్థానాల్లో లొంగిపోతాం. మొదటి రోజు ఒకమాట, రెండో రోజు మరో మాట మార్చిన మృతిని బంధువులకు నార్కోటిక్ టెస్ట్ చేయండి. అందులో తప్పులేదని తేలితే ఓ ప్రకటన ఇవ్వండి. లేకపోతే తప్పు నాదని నిరూపించాలని అన్నా రాంబాబు సవాల్ విసిరారు.  

ఆయన ఇంకా ఏమన్నారంటే.. " ఇద్దరం ప్రజాతీర్పు కోరుదాం. పవన్‌ కళ్యాణ్‌, నేను పోటీ చేద్దాం. పవన్‌ కళ్యాణ్‌ గెలిస్తే ఎలాంటి విచారణ లేకుండా న్యాయవ్యవస్థ ఏ శిక్ష విధించినా.. ఆ శిక్షను అనుభవిస్తాను. ఎవరి విధివిధానాలు ఏంటో ప్రజలను కోరుదాం. ప్రజలు పవన్‌ కళ్యాణ్‌ను ఓడిస్తే పార్టీని మూసేయాలి. ఈ ఛాలెంజ్‌కు సిద్ధమైతే రేపు ప్రకటించండి.. అంటూ అన్నా రాంబాబు ప‌వ‌న్‌కు స‌వాలు విసిరారు. ఈ సవాలు పై జనసేన ఇప్పటి వరకూ స్పందించలేదు. దీంతో వైసీపీ నేతలు మరింతగా జోష్ పెంచారు. మరి జనసేన ఏమంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: