ఏపీలో సినీ రాజకీయం జోరుగా సాగుతోంది. సినిమా హీరోల మాటల తూటాలు, ఏపీ మంత్రులు వారికి ఇచ్చే కౌంటర్లతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టికెట్ రేట్ల వ్యవహారంతో ఈ గొడవ మొదలైంది. టికెట్ రేట్లు, ఆన్ లైన్ విధానంపై గతంలో పవన్ కల్యాణ్ కూడా ఓసారి తీవ్ర విమర్శలు చేశారు. అప్పట్లో ఏపీ మంత్రులు అదే స్థాయిలో ఆయనకి కౌంటర్లు ఇచ్చారు. తాజాగా హీరో నాని చేసిన వ్యాఖ్యలపై కూడా ఏపీ మంత్రులు అదే స్థాయిలో ధ్వజమెత్తారు.

సినిమా థియేటర్ కౌంటర్ ని, కిరాణా కొట్టు కౌంటర్ తో పోలుస్తూ నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. ఆ తర్వాత మంత్రులు ఒక్కొక్కరే నానిపై ధ్వజమెత్తారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా సినిమా ఇండస్ట్రీపై అందులో ఉన్న కుటుంబాల పెత్తనంపై ధ్వజమెత్తారు. తెలుగు సినీ పరిశ్రమలో వారసత్వం బాగా పెరిగిపోయిందని, ఇండస్ట్రీ అంతా వారసుల చుట్టూనే తిరుగుతోందని అన్నారు నారాయణ స్వామి..

50 ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీ మూడు కుటుంబాల ఆధిపత్యంలో కొనసాగుతోందని విమర్శలు చేశారాయన. కొత్తవారికి థియేటర్లు ఇవ్వడంలేదని, కుటుంబాల పెత్తనం, వారసత్వం వల్లే కొత్తవారికి అవకాశాలు రాకుండా పోతున్నాయని చెప్పారు. రాజకీయాల్లో వారసుల గురించి విమర్శిస్తారు కానీ, సినీ ఇండస్ట్రీలో వారసుల మాటేంటని ప్రశ్నించారు. నిర్మాత నష్టపోయినప్పుడు తెలుగు సినిమా హీరోలు ఆదుకోరని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సినీ ఇండస్ట్రీ కొన్ని కుటుంబాల గుప్పెట్లో ఉందనే విమర్శ చాన్నాళ్లుగా వినిపించేదే. అయితే సినీ విమర్శకులు, సినిమాలతో సంబంధం ఉన్నవారు, సినీఇండస్ట్రీలోనే వేర్వేరు విభాగాల్లో ఉన్నవారు ఇన్నాళ్లూ ఈ విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు ఇండస్ట్రీపై విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యంగా ఏపీ మంత్రులు విడతలవారీగా విమర్శల డోసు పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా గ్యాప్ పెరిగింది. ఏపీ మంత్రులు, తెలుగు సినిమా హీరోల మధ్య ఈ గ్యాప్ మరింత పెరిగే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: