జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. తాను ఏ సామాజికవర్గానికి చెందిన వాడిని కానని ఒకసారంటారు. జనాల్లో కులభావన పెరిగి ఎవరి కులం వాళ్ళు ఆ సేతను ఓన్ చేసుకోవాలని మరోసారంటారు. తాజాగా మాట్లాడుతు పోయిన ఎన్నికల్లో తనకు కాపులు కూడా ఓట్లేయలేదని వాపోయారు. తాను కాపు సామాజికవర్గానికి చెందిన వాడినే అయినప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో పోయిన ఎన్నికల్లో కాపులు కూడా తనను ఓన్ చేసుకోలేదని ఫీలైపోయారు.





అయితే కాపులకన్నా జనసేనకు బీసీలు ముఖ్యంగా మత్స్యకార సామాజికవర్గం వాళ్ళే ఎక్కువగా ఓట్లేసినట్లు చెప్పారు. బీసీల సంక్షేమంపై పార్టీ ఆఫీసులో పవన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ సామాజికవర్గంలోని 140 ఉపకులాల సంక్షేమం చూడటమే తన బాధ్యతగా ఫీలవుతున్నట్లు చెప్పారు. జనసేన గెలుపు..బీసీల గెలుపని పవన్ నినాదమిచ్చారు. తనను ఒక కులానికి పరిమితంచేసి ఇతర కులాలతో తిట్టిస్తున్నట్లు ఫీలైపోయారు.





బీసీలకు రాజ్యాధికారం రావాలని తాను పంతంపట్టినట్లు పవన్ చెప్పుకున్నారు. బీసీలకు రాజ్యాధికారం కోసం పవన్ ఎప్పుడు పంతం పట్టారో ఎవరికీ తెలీదు. ఏ సామాజికవర్గానికైనా రాజ్యాధికారం దక్కటం అంటే ఏమిటి ? పలానా సామాజికవర్గంకు చెందిన నేత ముఖ్యమంత్రి అవ్వటమే. బీసీలకు రాజ్యాధికారం కోసం తాను పంతం పట్టిందే నిజమైతే మరి చంద్రబాబునాయుడుతో పొత్తుపెట్టుకోవాలని పవన్ ఎలా ప్లాన్ చేస్తున్నారు. టీడీపీతో పొత్తంటే చంద్రబాబు సీఎం అవుతారు కానీ బీసీ నేత సీఎం ఎలా అవుతారు ?





ఈ సమావేశంలో కూడా ‘నినాదాలిస్తే ఎవరు సీఎం అయిపోరని, ఓట్లువేసి, ఇతరులతో వేయిస్తేనే తాను ముఖ్యమంత్రిని అవుతా’నన్నారు. ఒకవైపు బీసీలకు రాజ్యాధికారమని చెబుతూనే అందరు ఓట్లేస్తేనే తాను సీఎం అవుతానని చెప్పటమే విచిత్రంగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో కాపులు-శెట్టిబలిజలను ఏకంచేసినట్లు చెప్పారు. పవన్ చెప్పిందానికి ఆధారం ఎక్కడా కనబడటంలేదు. ఎందుకంటే ఉభయగోదావరి జిల్లాల్లో శెట్టిబలిజలు, కాపులు రాజకీయంగా ఒకళ్ళని మరొకళ్ళు తీవ్రంగా వ్యతిరేకించుకుంటారు. ఎన్నికలు వస్తేకానీ పవన్ చెప్పింది నిజమో కాదో తెలీదు. మొత్తానికి తనను కాపులు కూడా ఓన్ చేసుకోలేదని బాధ పవన్లో బాగా ఎక్కువగా ఉన్నట్లు బయటపడింది.



మరింత సమాచారం తెలుసుకోండి: