జూబ్లీహిల్స్ ఉపఎన్నికల హీట్ మధ్య మాగంటి కుటుంబం వారసత్వ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. దివంగత మాజీ ఎంపీ మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటివరకు మీడియా ముందు కనిపించని ఆమె, ఈసారి రెవెన్యూ అధికారుల ఎదుట తన మనసులోని మాట బయటపెట్టారు. ఆమె సంచలనంగా మాట్లాడుతూ – “నా కొడుకు ఎప్పుడు చనిపోయాడో మాకు తెలియదు. కేటీఆర్ వచ్చాకే గోపీనాథ్ మరణం ధృవీకరణ అయ్యింది. ఎందుకు అలా జరిగిందో కేటీఆరే చెప్పాలి” అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలను కుదిపేశాయి. అంతేకాదు, గోపీనాథ్ మొదటి భార్య మాలినితోనే నిజమైన వివాహం జరిగిందని, ఆమె కుమారుడు ప్రద్యుమ్నకే వారసత్వ హక్కులు దక్కాలని తల్లి స్పష్టంగా ప్రకటించారు.


“సునీతతో గోపీనాథ్ పెళ్లి నేను చేయలేదు. ఆమె రెండేళ్లు మాత్రమే మా దగ్గర ఉండి వెళ్లిపోయారు. మాలినితో విడాకుల కేసు వేసినా అవి రద్దు అయ్యాయి. అందరూ గోపీనాథ్ పిల్లలే. కుటుంబం అంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి. కానీ ఇప్పుడు అందరం విడిపోయాం” అంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా మహానందకుమారి గారు చేసిన మరో వ్యాఖ్య మరింత షాకింగ్‌గా మారింది. “నా కొడుకు వెంటిలేటర్‌పై ఉన్నాడని తెలిసినప్పుడు వెళ్లి చూడాలని అనుకున్నా, అనుమతించలేదు. కేటీఆర్ అక్కడికి వచ్చినప్పుడు ‘నన్ను చూడనివ్వట్లేదు, నువ్వు అయినా చెప్పు’ అన్నా. ఆయన మాట్లాడి వస్తానన్నాడు కానీ… తిరిగి రాలేదు” అని చెప్పడం ఇప్పుడు కేటీఆర్‌పై ఒత్తిడి పెంచింది.


ఇక గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు ప్రద్యుమ్న కూడా మీడియా ఎదుట మాట్లాడి బాంబ్ పేల్చాడు. “నాన్న మరణించినప్పుడు నేను అమెరికాలో ఉన్నా. రావొద్దని చెప్పారు. రావడం వల్ల గొడవలు జరుగుతాయని హెచ్చరించారు. ఇప్పుడు కూడా కొందరు బెదిరిస్తున్నారు” అంటూ బీఆర్‌ఎస్ నేతల పేర్లు బయటపెట్టనున్నట్లు సంకేతాలిచ్చాడు. ఈ వివాదంపై ఇప్పటికే కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందిస్తూ, “మాగంటి గోపీనాథ్ మరణంపై విచారణ జరగాలి. కేటీఆర్ సమాధానం చెప్పాలి” అన్నారు. దీంతో మాగంటి కుటుంబం, బీఆర్‌ఎస్ నాయకత్వం, వారసత్వ వివాదం, ఎన్నికల రాజకీయాలు – అన్నీ కలగలిసి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. మాగంటి గోపీనాథ్ మరణం వెనుక నిజం ఏమిటి? ఆయన తల్లి చేసిన మిస్టరీ కామెంట్స్‌కు కేటీఆర్ ఏం సమాధానం ఇస్తారన్న దానిపైనే ఇప్పుడు అందరి చూపు నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: