ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వైసీపీ చర్చనీయాంశంగా మారింది. “జగన్ రెడీ” అంటూ పార్టీ వర్గాలు చేస్తున్న ప్రచారం ఇప్పుడు రాజకీయ వేడి పెంచుతోంది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఎదుర్కొన్న భారీ ఓటమి తర్వాత పార్టీ క్యాడర్ లో తీవ్ర నిరాశ నెలకొన్నది. అయితే ఇప్పుడు ఆ నిరాశ మళ్లీ జోష్‌గా మారబోతుందనే సంకేతాలు కన్పిస్తున్నాయి. ఓటమికి కారణం నేతల నిర్లక్ష్యం, క్యాడర్‌తో దూరం పెరగడం అని మొదటి రోజుల నుంచే అంగీకరించిన వైసీపీ ఇప్పుడు అదే క్యాడర్ ఆధారంగా తిరిగి నిలబడే ప్రయత్నం చేస్తోంది. గత ఏడాదిన్నర కాలంగా జగన్ తాడేపల్లి–బెంగళూరు మధ్యే ఉండిపోయారన్న విమర్శలు వస్తున్నాయి. “జనంలోకి రా జగన్” అనే నినాదం వైసీపీ శ్రేణుల్లో విస్తరిస్తోంది.
 

తాజగా క్రిష్ణా జిల్లాలో తుఫాన్ బాధితులను కలిసినప్పుడు జగన్‌కు మంచి స్పందన రావడంతో, పార్టీకి కొత్త ఊపు వచ్చింది. ఇక నుంచి నెలకు రెండు జిల్లాల చొప్పున పర్యటనలు చేపట్టాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనల్లో ఆయన క్యాడర్‌ను కలుస్తూ, స్థానిక సమస్యలను తెలుసుకుంటూ పార్టీని మళ్లీ గాడిలో పెట్టే ప్రణాళికలో ఉన్నారని సమాచారం. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు సన్నాహక దశలోకి వచ్చాయి. 2026 ప్రారంభంలోనే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని అంచనా. అధికార కూటమి ఇప్పటికే తగిన ప్రణాళికలు వేస్తుండగా, వైసీపీ కూడా గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు 85% లోకల్ బాడీస్ గెలుచుకున్న వైసీపీ, ఈసారి గట్టి పోరాటం ద్వారా కనీసం అర్ధభాగం తిరిగి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.



జగన్ పర్యటనలు మొదలైతే క్యాడర్‌లో మళ్లీ జోష్ వస్తుందనే నమ్మకం పార్టీ వర్గాల్లో ఉంది. ఆయన ప్రత్యక్షంగా నేతలను, కార్యకర్తలను కలవడం ద్వారా మానసిక బలాన్ని నింపగలరని భావిస్తున్నారు. “క్యాడర్ మళ్లీ మంటపెట్టాలి.. ప్రజల్లో వైసీపీ జోరు తిరిగి రాబట్టాలి” అని అధినాయకత్వం గట్టిగా నిర్ణయించినట్లు సమాచారం. పార్టీ ఈసారి అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించనుంది. సరైన వ్యక్తులను ముందుకు తేవడం ద్వారా కూటమికి టఫ్ ఫైట్ ఇవ్వాలని జగన్ సంకేతం ఇచ్చారట. మొత్తానికి వైసీపీ మళ్లీ మైదానంలోకి దిగి, “జగన్ వచేస్తున్నాడు” అన్న నినాదంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సీన్స్ మొదలుకానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: