జూబ్లిహిల్స్ ఉపఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ, రాజకీయ సమరం వేడెక్కుతోంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ముదురుతున్న పోటీకి కారణంగా ప్రతి పార్టీ తమ సొంత శైలిలో ప్రచారం చేస్తోంది. అయితే ఇందులో మంత్రి కేటీఆర్ చేస్తున్న ప్రచారం ఇప్పుడు ప్రధాన చర్చాంశంగా మారింది. ఆయన ప్రచార పద్ధతిని కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరదాగా సెటైర్ చేశారు. కేటీఆర్ ప్రచారాన్ని “ ఐటం సాంగ్ ” తో పోల్చిన రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన విధానం ప్రజల దృష్టిని ఆకర్షించింది. “కేటీఆర్ ప్రచారం ఏదో ఐటం సాంగ్‌లా ఉంది. బయట స్క్రీన్లు పెట్టి అందులో రేవంత్ రెడ్డి స్పీచ్‌లను చూపిస్తూ ప్రచారం చేస్తున్నారు. అలాంటి మాటలతో, వీడియోలతో ప్రజల మనసులు గెలుచుకోలేరు” అని ఆయన అన్నారు. కేటీఆర్ తమపై చేసిన విమర్శలతో ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.


హైదరాబాద్‌లో పాలన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. “హైదరాబాద్ తాగునీటి సమస్య ఉన్నప్పుడు కృష్ణా నీటిని నగరానికి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. విద్యుత్ కొరత ఉన్న జంట నగరాలకు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించాం. అందుకే దిగ్గజ సంస్థలు హైదరాబాద్ వైపు వలస వచ్చాయి” అని అన్నారు.  “ హైదరాబాద్ గ్రోత్ కారిడార్‌గా మారడానికి జైపాల్ రెడ్డి లాంటి నేతల కృషి ఉంది. ఆయన ప్రయత్నాల వల్లే మెట్రో వచ్చింది. రాష్ట్రాన్ని మేము అప్పగించినప్పుడు 60 వేల కోట్ల మిగులు ఉంది. కానీ బీఆర్‌ఎస్ పదేళ్లలో 8 లక్షల 11 వేల కోట్ల అప్పులు మిగిల్చింది ” అని విమర్శించారు.


కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా రేవంత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. “ 1 లక్ష 87 వేల కోట్లు ఖర్చు చేశారు, కానీ ఒక్క ఎకరాకూ నీరు ఇవ్వలేదు. ఆ డబ్బులు ఎక్కడికి పోయాయి ? ” అని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో అవినీతి, దుర్వినియోగం పరాకాష్టకు చేరాయని అన్నారు. ఇక కేటీఆర్‌పై నేరుగా విరుచుకుపడుతూ, “సొంత చెల్లిని అవమానించిన వాడు ప్రజలకు న్యాయం చేస్తాడా? కేటీఆర్‌తో ఉండలేక కేసీఆర్ ఫార్మ్ హౌస్‌లోకి వెళ్లిపోయాడు. అలాంటి వారితో కిషన్ రెడ్డి సావాసం చేయడం విచిత్రం” అని రేవంత్ విమర్శించారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ద్వారా నిజమైన అభివృద్ధి జరుగుతుందని రేవంత్ స్పష్టం చేశారు. “ జూబ్లిహిల్స్ గెలవాల్సిందే, అభివృద్ధి కొనసాగించాల్సిందే ” అని ఆయన పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: