ఇటీవల ఢిల్లీలో జరిగిన బాంబు పేలుడు ఘటనతో నగరంలో ఆందోళన వాతావరణం నెలకొంది. పోలీసులు ఎంత హై సెక్యూరిటి పెట్టిన జనాలకి మాత్రం ఇంకా ఆ భయం పోళేదు. బయట తిరగాలి అంటేనే భయపడిపోతున్నారు. ఎప్పుడు..? ఎక్కడ..? ఏం జరుగుతుందో..? తెలియని పరిస్థితిలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో ఢిల్లీ నగరంలోని పలు జిల్లా కోర్టులు, సీఆర్పీఎఫ్ పాఠశాలలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం హడలెత్తిస్తుంది.తాజాగా నాలుగు కీలక కోర్టులు — సాకేత్, రోహిణి, ద్వారక, పటియాలా హౌస్ కోర్టులు, అలాగే రెండు సీఆర్పీఎఫ్ పాఠశాలలను పేల్చివేస్తామని తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా బెదిరింపులు పంపించారు. ఇది ఉగ్రవాదుల పనే అంటున్నారు జనాలు. దీంతో వెంటనే భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది..


పోలీసులు సంబంధిత కోర్టులన్నింటినీ వెంటనే ఖాళీ చేయించారు. న్యాయవాదులు, క్లయింట్లు, సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ బృందాలు ముమ్మర తనిఖీలు చేపట్టాయి. ఏ చిన్న అనుమానాస్పద వస్తువు కనిపించినా వెంటనే చెక్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.సీఆర్పీఎఫ్‌కు చెందిన రెండు పాఠశాలల్లోనూ విద్యార్థులు, సిబ్బందికి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు ధైర్యం చెబుతూనే, భద్రత చర్యలను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు ..



ఇదిలా ఉండగా, ఈ బెదిరింపుల వెనుక ఎవరు ఉన్నారు? ఏ ఉగ్రవాద గుంపు ఈమెయిల్ పంపింది? దాని నిజస్వరూపం ఏంటి? అనే దానిపై ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలను నియమించి దర్యాప్తు వేగవంతం చేశారు. సైబర్ సెల్ కూడా బెదిరింపు మెయిల్ ప్రారంభమైన ఐపి అడ్రస్‌ను ట్రాక్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఢిల్లీలో మళ్లీ అలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు నగరభద్రతను పటిష్టం చేస్తూ, ప్రజలను కంగారు పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఢిల్లీ వ్యాప్తంగా హై సెక్యూరిటి పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: