ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు (ఆర్.ఆర్.ఆర్) ఇప్పుడు తన రాజకీయ వ్యూహాన్ని పూర్తిగా మార్చుకున్నారు. శాసనసభ సభ్యుడిగా, కేబినెట్ ర్యాంకుతో కూడిన డిప్యూటీ స్పీకర్ పదవిని అనుభవిస్తున్నా, ఆయన మనసంతా ఢిల్లీపైనే కేంద్రీకృతమై ఉంది. రాష్ట్ర రాజకీయాల కంటే కేంద్ర రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న ఆయన, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పార్లమెంటు నుంచి పోటీ చేయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. రఘురామ కృష్ణరాజు ప్రధాన లక్ష్యం నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం టిక్కెట్. గత ఎన్నికల్లోనూ ఆయన ఈ సీటు కోసమే ప్రయత్నించారు. అయితే, ఆ సీటు బీజేపీ కోటాలోకి వెళ్లిపోవడంతో, టీడీపీ నాయకత్వం తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనను ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించింది.


 అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును ఒప్పించి, ఆయనకు నామినేటెడ్ పోస్టు (ఏపీఐఐసీ ఛైర్మన్) ఇచ్చి మరీ, రఘురామకు ఉండి సీటు కేటాయించారు. అయినా, ఎమ్మెల్యే పదవి, డిప్యూటీ స్పీకర్ హోదా ఆయనకు సంతృప్తిని ఇవ్వడం లేదు. తన సన్నిహితుల వద్ద కూడా ఆయన ఈ విషయంపై తరచూ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. అందుకే, వచ్చే ఎన్నికల్లో ఉండి నుంచి పోటీ చేయడానికి ఆయన పెద్దగా ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో జనసేనలోనూ కొంత అసంతృప్తి ఉంది. గతంలో తమకు కేటాయించని ఉండి సీటు విషయంలో, జనసేన ఇన్‌ఛార్జి నాగరాజు ఇప్పటికీ ఎలాంటి పదవి దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారట. మరోవైపు, రఘురామ కృష్ణరాజు ఇప్పటికే నరసాపురం పార్లమెంటు టిక్కెట్ కోసం గ్రౌండ్‌ వర్క్‌ ప్రారంభించారు. ప్రస్తుతం నరసాపురం ఎంపీగా ఉన్న శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రిగా ఉన్నారు.

 

ఈ నేపథ్యంలో, ఆయనను తప్పించి రఘురామకు టిక్కెట్ ఇవ్వడం అంత సులభం కానప్పటికీ, ఈసారి ఆ సీటును టీడీపీ కోటాలో తనకు కేటాయించాలని ఆయన గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.మొత్తంగా, రాష్ట్ర రాజకీయాలపై విసుగు చెందిన రఘురామ, తన అనుభవాన్ని ఢిల్లీ స్థాయిలో వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ కీలక నిర్ణయం టీడీపీ, జనసేన కూటమిలో ఎలాంటి రాజకీయ సమీకరణాలకు దారి తీస్తుందో, గోదావరి జిల్లాల రాజకీయాలపై ఆయన పోరాటం ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఆయన పట్టుదల నరసాపురం టిక్కెట్‌ను సాధించిపెడుతుందా? లేదా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: