అనగనగా ఒక ఊర్లో దానయ్య.. వీరయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు. దానయ్య ప్రతి విషయంలో కూడా వీరయ్యను సరిచేస్తూ ఉండేవాడు. మొదట్లో వీరయ్య బాగా సంతోషించేవాడు. పొరపాటు సరిదిద్దుకొని దానయ్యకు ధన్యవాదాలు కూడా తెలిపే వాడు. దాంతో దానయ్యకు తను వీరయ్య కన్నా తెలివైనవాడినని తన సలహా లేనిదే ఏ పని కూడా చేయలేడని నమ్మకం ఏర్పడింది. దానయ్య కూడా వీరయ్యను చులకనగా చూడడం మొదలు పెట్టాడు.. ఇదంతా చూస్తున్న వీరయ్య కు.. రాను రానూ దానయ్యతో స్నేహంగా ఉండడం కష్టమనిపించ సాగింది. ఏం చేయాలో పాలుపోక గ్రామ పెద్దను సలహా అడిగాడు వీరయ్య.

గ్రామ పెద్ద మర్నాడు.. దానయ్యను తన దగ్గరికి రమ్మని కబురు పంపాడు. కుశల ప్రశ్నలు అడిగిన తరువాత 'ఇదివరకే వీరయ్య పొలంలో కలుపు సమస్య ఎక్కువగా ఉందని తెలిసింది. ఈరోజు నుంచి నువ్వు క్రమం తప్పకుండా అతని పొలంలో కలుపు తీయాలి!' అని ఆజ్ఞాపించాడు. తన నైపుణ్యాన్ని గ్రామాధికారి కూడా గమనించాడని సంబరపడ్డాడు. దానయ్య కొన్ని రోజులు ఉత్సాహంగా వీరయ్య పొలంలో ప్రతిరోజు క్రమం తప్పకుండా పని చేశాడు. కానీ క్రమంగా అతనికి ఈ పని విసుగనిపించడం మొదలైంది. పైగా తన సొంత పొలంలో కలుపు తీసే పని అటకెక్కింది.

 వెళ్లి గ్రామాధికారితో మొరపెట్టుకున్నాడు దానయ్య..అప్పుడు గ్రామాధికారి మరి వీరయ్య పొలంలో కలుపు తీయకపోతే అతనికి కష్టం కదా? అని అడిగాడు 'అయ్యా అతని పొలం బాధ్యత అతనిది కదా? అతని పొలం శుభ్రం చేస్తుంటే నా పొలంలో కలుపు పెరిగిపోతోంది!'అన్నాడు దానయ్య అప్పుడు గ్రామాధికారి దానయ్య నువ్వు అనుక్షణం వీరయ్యను కనిపెట్టుకొని ఉంటావని.. అతని పొరపాట్లను సరిదిద్దుతావని విన్నాను. అందుకే అతని పొలం బాధ్యత నీకు అప్పగించాను కానీ నా కళ్ళు తెరిపించావు. ఎవరి పొలంలో కలుపు వాళ్లే తీసుకోవాలి.. ఎవరి తప్పులు వారే సరిదిద్దుకోవాలి. ఏమంటావు? జ్ఞానోదయం అయినా దానయ్య అప్పట్నుంచి వీరయ్యకు అతిగా సలహాలు ఇవ్వటం మానుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: