ఆస్ట్రేలియా గడ్డ పై జరుగుతోన్న టీ20 సిరీస్లో
శ్రీలంక తేలిపోతోంది. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో కంగారూల చేతిలో ఏకంగా 134 పరుగుల తేడాతో ఓడిన లంకేయులు బ్రిస్బేన్ వేదికగా బుధవారం జరిగిన రెండో టీ20 లోనూ ఓడింది. దీంతో మూడు టీ20ల సిరీస్ ని ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తో
ఆస్ట్రేలియా కైవసం చేసుకోగా ఆఖరి టీ20 మ్యాచ్ మెల్బోర్న్ లో శుక్రవారం జరగబోతుంది. ఐసీసీ టీ - 20 ర్యాంకింగ్స్ లో మొదటి స్థానంలో ఉన్న పాకిస్థాన్ జట్టుని దాని సొంతగడ్డ పైనే ఇటీవల 3-0 తేడాతో టీ - 20 ల్లో
శ్రీలంక క్లీన్ స్వీప్ చేసిన విషయం అందరికి తెలిసిందే.
బుధవారం రెండో టీ - 20 మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన
శ్రీలంక జట్టు పేలవంగా 19 ఓవర్లలోనే 117 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో కుశాల్ పెరీరా (27: 19 బంతుల్లో 2x4, 1x6) టాప్ స్కోరర్గా నిలవగా, ఓపెనర్ గుణతిలక (21), ఫెర్నాండో (17) చెప్పుకొనే స్కోరు చేశారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో స్టాన్ లేక్, పాట్ కమిన్స్, అస్టన్ అస్గర్, ఆడమ్ జంపాలు తలా రెండు వికెట్లు పడగొట్టగా కుశాల్ మెండిస్, సందకన్ రన్ అవుట్ అయ్యారు. కెప్టెన్
లసిత్ మలింగ, హసనరంగ స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్లో స్టంపౌట్ గా వెనుదిరగడం జరిగింది.
తర్వాత
118 పరుగుల లక్ష్యాన్ని
ఆస్ట్రేలియా కేవలం 13 ఓవర్లలోనే ఆడుతూ పడుతూ ఛేదించింది. ఓపెనర్, కెప్టెన్ అయిన అరోన్ ఫించ్ గోల్డెన్ డక్గా ఔటైనా ఆ తర్వాత వచ్చిన స్టీవ్స్మిత్ (53 నాటౌట్: 36 బంతుల్లో 6x4)తో కలిసి ఓపెనర్ డేవిడ్ వార్నర్ (60 నాటౌట్: 41 బంతుల్లో 9x4) రాణించి ఇన్నింగ్స్ ని గెలిపించారు. రెండో వికెట్ కి వీరిద్దరూ అజేయంగా 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీ, లంక బౌలర్లకి మ్యాచ్లో ఏమాత్రం పుంజుకునే అవకాశం వారికీ ఇవ్వలేదు. గతంలో బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది నిషేధానికి గురైన వార్నర్, స్మిత్ పునరాగమనంలో తొలిసారి టీ20ల్లో ఈ సిరీస్ లో ఆడుతున్నారు.