భారత జట్టుకు ఆడడం ఏ క్రికెటర్‌కైనా జీవితంలో పెద్ద కల అది అందరికి ఉంటుంది. కానీ ఆ ఛాన్స్ కొందరికే దొరుకుతుంది. అంతటి ప్రతిష్టాత్మక జట్టులో చోటు దక్కడం ఒక గౌరవం అయితే, ఆ తర్వాత అంతర్జాతీయ వేదిక అయిన ప్రపంచకప్‌లో బరిలో దిగే అవకాశం రావడం అంటే ఆ కల నెరవేరినట్టే. అలాంటి అదృష్టం కడపకు చెందిన తెలుగు అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణికి దక్కింది. అతి తక్కువ సమయంలో తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుని, భారత్ కప్ గెలుపులో కీలక పాత్ర పోషించింది ఈ యువ స్పిన్నర్. 21 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్ ప్రపంచంలో తనదైన గుర్తింపును తెచ్చుకున్న శ్రీచరణి మొదట క్రికెట్ వైపు మొగ్గు చూపలేదు. చిన్నతనంలో ఆమె బ్యాడ్మింటన్, కబడ్డీ వంటి క్రీడల్లో పాల్గొనేది. కానీ కాలక్రమేణా క్రికెట్ పట్ల ఆసక్తి పెరిగి, తన పూర్తి శ్రద్ధను ఆ దిశగా మళ్లించింది. మొదట ఫాస్ట్ బౌలర్గా కెరీర్ ప్రారంభించినా, ఆశించిన ఫలితాలు రాకపోవడంతో స్పిన్నర్‌గా మారింది. అదే మార్పు ఆమె జీవితాన్ని మార్చేసింది.దేశవాళీ స్థాయిలో స్థిరంగా రాణించిన ఆమె ప్రతిభను గమనించిన దిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ, గత ఏడాది డబ్ల్యూపీఎల్ వేలంలో రూ.55 లక్షలతో ఆమెను కొనుగోలు చేసింది. ఆ తర్వాతి రోజుల్లో ఆమె ప్రదర్శన మరింత అద్భుతంగా మారింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన సీనియర్ మహిళల టోర్నీలో భారత్-బీ తరఫున ఆడుతూ తన నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకుంది.


ఇంత త్వ‌రగా జాతీయ జట్టులో స్థానం దక్కుతుందని శ్రీచరణి ఊహించలేదు. కానీ ఆమె చూపించిన స్థిరమైన ఫామ్‌, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌లోని వైవిధ్యం సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాయి. ఫలితంగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో శ్రీలంక పర్యటనకు ఎంపికై, భారత సీనియర్ జట్టులో అరంగేట్రం చేసింది.“అనుభవం కంటే నైపుణ్యానికే ప్రాధాన్యత” అన్న సూత్రం ప్రకారం సెలెక్టర్లు ఆమెకు అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఆమె వమ్ము చేయలేదు. వికెట్ల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ గేమ్ చేంజర్‌గా నిలిచింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో ఆమె బౌలింగ్ ప్రత్యర్థి జట్టును కట్టడి చేసింది. డీవై పాటిల్ పిచ్‌లా బ్యాటర్ల స్వర్గధామమైన మైదానంలో కూడా, ఆసీస్ బౌలర్ల జోరును డెత్ ఓవర్లలో నిలువరించడం ఆమె బౌలింగ్ నైపుణ్యానికి నిదర్శనం.



శ్రీచరణి బౌలింగ్‌లో ప్రధాన ఆకర్షణ ఆమె వైవిధ్యం. బ్యాటర్ల కదలికలను గమనిస్తూ, వేగం తగ్గించడం, ఒక బంతిని టర్న్ చేయడం, మరొకదాన్ని నేరుగా వేయడం వంటి పద్ధతులతో ప్రత్యర్థులను తికమక పెట్టడం ఆమె ప్రత్యేకత. ఆమె బంతులు అంచనాలకు అందనివిగా మారి, కీలక సమయాల్లో వికెట్లు సాధించడంలో సహకరించాయి.ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్లలో దీప్తి శర్మ తర్వాత రెండవ స్థానంలో శ్రీచరణి నిలిచింది. ఇప్పటి వరకు ఆమె 17 వన్డేల్లో 22 వికెట్లు, అలాగే ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు పడగొట్టింది. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది.



కడప మట్టి నుంచి అంతర్జాతీయ వేదిక వరకు తన ప్రతిభతో దూసుకెళ్లిన నల్లపురెడ్డి శ్రీచరణి ఈ తరం యువతికి ఆదర్శంగా నిలిచింది. ఆమె కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది —"అవకాశం ఆలస్యంగా రావచ్చు... కానీ సిద్ధంగా ఉన్నవారికి అది తప్పక వస్తుంది!"

మరింత సమాచారం తెలుసుకోండి: