
ట్విట్టర్ నుంచి కంగనా అకౌంట్ను డిలీట్ చేయడంపై ఆ సంస్థ అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ట్విట్టర్ నిబంధనలను పదే పదే ఉల్లంఘించడం వల్లే ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. విద్వేషం, దూషణ విధానాలను కంగనా అతిక్రమించిందని స్పష్టం చేశారు. తమ దృష్టిలో అందరూ ఒక్కటే అని తెలిపారు.
ఇక వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాకాండపై పొలిటీషియన్, జర్నలిస్ట్ స్వపన్ దాస్గుప్తా చేసిన ట్వీట్పై కంగనా స్పందిస్తూ.. మమతా బెనర్జీని రాక్షసితో పోల్చింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2000వ సంవత్సరం నాటి విరాట స్వరూపంతో ఆమె అంతు చూడాలని పేర్కొంది. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేసింది. ఈ ట్వీట్ వివాదానికి దారితీసింది. మమతా మద్దతుదారులు ఆమెపై విమర్శలు గుప్పించారు. హింసను ప్రేరేపించే విధంగా ఆమె ట్వీట్ ఉందంటూ రిపోర్ట్ చేశారు. దీంతో ట్విట్టర్ ఆమె అకౌంట్ను పూర్తిగా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో నెటిజనులు వివిధ మీమ్స్, జోకులతో సెటైర్లు పేలుస్తున్నారు. మోడీకి నాటి అల్లర్లతో సంబంధం ఉందని పరోక్షంగా చెబుతున్నావా అని కొందరు కంగనాని దారుణంగా తిడుతున్నారు.