ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నేత, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ప్రస్తుతం వహిస్తున్న 'మౌనం' ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉత్తరాంధ్ర హక్కుల కోసం, ప్రత్యేకించి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం గతంలో గట్టిగా గళం వినిపించిన ఆయన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మౌనంగా ఉన్నారనేదానిపై పార్టీలోనే ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.


ఉత్తరాంధ్ర సమస్యలపై నిశ్శబ్దం :
ఉత్తరాంధ్రకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టులు, విశాఖ రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై కొణతాల గతంలో అలుపెరగని పోరాటం చేశారు. 2024 ఎన్నికలకు ముందు వరకు ఈ సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన ఆయన, కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత గత ఆరు నెలలుగా ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కీలక పరిణామాలు జరుగుతున్నా, ఆయన ఎందుకు స్పందించడం లేదనేది ఇప్పుడు ఇటు ప్రజల్లో, అటు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.


రాజకీయ పునరేకీకరణ - జనసేనలో పాత్ర :
ఎన్నికలకు ముందు కొణతాల రామకృష్ణ జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కొణ‌తాల‌ జనసేన తరపున ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే, సీట్ల సర్దుబాటులో భాగంగా ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు ఏదైనా కీలకమైన పదవి లేదా ఉత్తరాంధ్ర అభివృద్ధి బోర్డు వంటి బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటివరకు ఆయనకు ఎలాంటి అధికారిక పదవి లభించలేదు. దీంతో ఆయన కొంత అసంతృప్తితో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.


'తటస్థ' వైఖరి వెనుక వ్యూహం ..?
కొణతాల మౌనం వెనుక ఒక రాజకీయ వ్యూహం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన గమనిస్తున్నారని, త్వరలోనే ఒక స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వస్తారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. అనకాపల్లి జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక బలమైన వర్గం ఉన్న కొణతాల, స్థానిక నాయకత్వంతో విభేదాలు రాకుండా ఉండేందుకే మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర చర్చా వేదిక ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించిన కొణతాల, ఇప్పుడు కేవలం జనసేన కార్యకర్తగా పరిమితం కావడం ఆయన అభిమానులకు మింగుడుపడటం లేదు.


రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో జాప్యం చేస్తే, ఆయన మళ్ళీ ప్రజా క్షేత్రంలోకి వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు ఉత్తరాంధ్ర గళంగా వినిపించిన కొణతాల రామకృష్ణ మౌనం వహించడం వెనుక పదవుల వేట ఉందా ? లేక పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నారా ? అనేది కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా, విశాఖ స్టీల్ ప్లాంట్ వంటి సున్నితమైన అంశాల్లో ఆయన వంటి సీనియర్ నేత స్పందన ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: