ఇటీవలి కాలంలో పిల్లలు చిన్న చిన్న విషయానికే మనస్థాపానికి గురై ఘాతకానికి పాల్పడుతున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. ఇదే తరహాలో మెదక్ జిల్లా నర్సాపూర్‌ మండలం అహ్మద్‌నగర్‌ గ్రామానికి చెందిన ఓ యువకుడు తన తండ్రి కళ్లజోడు కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తలారి దుర్గేశ్(20) వృత్తిరీత్యా మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. కాగా ఈ మధ్య కాలంలో తనకు చూపు సరిగ్గా కనిపించడం లేదని గురువారం రాత్రి తన తండ్రి అయిన తలారి వెంకటేశ్తో చెప్పాడు. తనకు కళ్లజోడు కొనివ్వమన్నాడు. దానికి వెంకటేశ్ ‘తర్వాత కొనిస్తాలే’ నాన్న అంటూ చెప్పుకొచ్చాడు. ఆ చిన్న విషయానికే మనస్థాపానికి గురైన దుర్గేశ్ తండ్రితో గొడవపడి అలిగి ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. ఎంత సమయం గడిచినా ఇంటికి రాకపోయే సరికి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పక్కింటి వాళ్లను, బంధువుల ఇళ్లలో ఆరా తీశారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో వెతుకగా చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. దీంతో చేతికందిన కొడుకు జీవచ్ఛవంలా చెట్టుకు వేళాడుతూ కనిపించడంతో ఆ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: